మోదీని చంద్రబాబు, బాలకృష్ణ ఇష్టానుసారం తిట్టారు: రోజా

  • జోగి రమేశ్ ఇంటికి వెళ్లిన రోజా
  • జోగి రమేశ్, ఆయన కుటుంబ సభ్యులకు పరామర్శ
  • జోగి కుటుంబాన్ని గత 18 నెలలుగా వేధిస్తున్నారని మండిపాటు
మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ ఇంటిపై జరిగిన దాడిని ఆ పార్టీ మహిళా నేత, మాజీ మంత్రి రోజా ఖండించారు. ఇబ్రహీంపట్నంలోని జోగి రమేశ్ ఇంటికి రోజా వెళ్లారు. జోగి రమేశ్ ను, ఆయన కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు. ఆయన ఇంటిని పరిశీలించారు. 

అనంతరం రోజా మీడియాతో మాట్లాడుతూ... జోగి రమేశ్, అంబటి రాంబాబు నివాసాలపై దాడుల వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ఉన్నారని అన్నారు. వీరిని చూసుకునే టీడీపీ శ్రేణులు బరితెగించాయని మండిపడ్డారు. 

జోగి రమేశ్ కుటుంబాన్ని కూటమి ప్రభుత్వం గత 18 నెలలుగా సాధిస్తోందని రోజా అన్నారు. గతంలో జోగి రమేశ్, ఆయన కుమారుడు, ఆయన భార్యపై కేసులు పెట్టారని మండిపడ్డారు. తిట్టిన ప్రతి ఒక్కరి ఇళ్లపై రాళ్లు రువ్వి, పెట్రోల్ పోసి తగలబెట్టాలనుకుంటున్నారని... ప్రధాని మోదీని చంద్రబాబు, బాలకృష్ణలు ఇష్టానుసారం తిట్టారని, వారి ఇళ్లను ఏం చేయాలని ప్రశ్నించారు. 

తిరుమల లడ్డూలోని నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని, అయోధ్యకు పంపిన లడ్డూలో కూడా కల్తీ నెయ్యి లేదని సీబీఐ నివేదిక ఇచ్చిందని రోజా అన్నారు. లడ్డూ విషయంలో హిందూ భక్తులను ఆందోళనకు గురి చేసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Roja
Jogi Ramesh
Chandrababu Naidu
Nara Lokesh
YSRCP
Andhra Pradesh Politics
TDP Attacks
Tirumala Laddu
Ayodhya Laddu
Balakrishna

More Telugu News