పసిమొగ్గల విక్రయం.. భారీ చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా గుట్టురట్టు

Child Trafficking Gang Busted Roshan Agarwal Key Suspect
  • అహ్మదాబాద్‌లో హైదరాబాద్ వ్యక్తి సహా ముగ్గురు అరెస్ట్
  • 15 రోజుల పసికందును రక్షించిన క్రైమ్ బ్రాంచ్, ఏటీఎస్
  • రూ. 3.6 లక్షలకు కొని భాగ్యనగరంలో అమ్మేందుకు ప్లాన్
  • జైలు నుంచి వచ్చాక మళ్లీ దందా మొదలుపెట్టిన నిందితులు
అమ్మకానికి పెట్టిన పసిమొగ్గలను అహ్మదాబాద్ పోలీసులు రక్షించారు. గుజరాత్ నుంచి దేశవ్యాప్తంగా పసికందులను సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్, ఏటీఎస్ పోలీసులు సంయుక్తంగా ఛేదించారు. ఈ ముఠాలో హైదరాబాద్‌కు చెందిన రోషన్ అగర్వాల్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తేలింది.

అహ్మదాబాద్‌కు చెందిన వందన పంచాల్ ఈ ముఠాకు నాయకత్వం వహిస్తుండగా, రోషన్ అగర్వాల్ (హైదరాబాద్), సుమిత్ యాదవ్ (యూపీ) ఏజెంట్లుగా పనిచేస్తున్నారు. 15 రోజుల వయసున్న బాబును విక్రయించేందుకు తరలిస్తుండగా, ఎయిర్‌పోర్ట్ సమీపంలో పోలీసులు మెరుపు దాడి చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు.

అహ్మదాబాద్‌లో మున్నా అనే వ్యక్తి వద్ద రూ. 3.60 లక్షలకు బాబును కొనుగోలు చేసిన ఈ ముఠా, హైదరాబాద్‌లోని నాగరాజు అనే మరో ఏజెంట్‌కు ఎక్కువ మొత్తానికి అమ్మేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. నిందితులు రోషన్, వందన గతంలోనూ ఇలాంటి కేసుల్లో జైలు శిక్ష అనుభవించి రావడం గమనార్హం. ప్రస్తుతం పరారీలో ఉన్న మున్నా, నాగరాజుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Go Back to Shorts
Roshan Agarwal
Child Trafficking
Ahmedabad
Hyderabad
Gujarat
Crime Branch
ATS
Infant Sale
Human Trafficking

More Telugu News