టీమిండియా ప్రవర్తనపై పాక్ మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు

  • అండర్-19 ఆసియా కప్ ఫైనల్‌లో భారత్‌పై పాకిస్థాన్ భారీ విజయం
  • 191 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించిన పాక్ జట్టు
  • 13 ఏళ్ల తర్వాత రెండోసారి ఆసియా కప్ ట్రోఫీ సాధించిన పాకిస్థాన్
  • భారత యువ జట్టు ప్రవర్తన క్రీడాస్ఫూర్తికి విరుద్ధమన్న సర్ఫరాజ్
  • పాక్ డ్రెస్సింగ్ రూమ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్

అండర్-19 ఆసియా కప్ ఫైనల్‌లో టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైంది. ఆదివారం (డిసెంబర్ 21) జరిగిన తుది పోరులో పాకిస్థాన్ జట్టు భారత్‌పై 191 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో పాకిస్థాన్ 13 ఏళ్ల తర్వాత రెండోసారి అండర్-19 ఆసియా కప్ ట్రోఫీని సొంతం చేసుకుంది.


ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 347 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. పాక్ బ్యాట్స్‌మన్ సమీర్ మిన్హాస్ అద్భుత ప్రదర్శనతో మెరిశాడు. అతడు 113 బంతుల్లో 172 పరుగులు చేసి జట్టు భారీ స్కోర్‌కు కీలక పాత్ర పోషించాడు.


భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కెప్టెన్ ఆయుష్ మాత్రే నేతృత్వంలోని భారత అండర్-19 జట్టు పూర్తిగా విఫలమైంది. పాక్ బౌలర్ల ధాటికి తట్టుకోలేక 156 పరుగులకే ఆలౌట్ అయింది.


ఇదిలా ఉండగా, మ్యాచ్ అనంతరం పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. భారత అండర్-19 జట్టు ప్రవర్తన క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ఉందని ఆయన ఆరోపించారు. గతంలో క్రీడాస్ఫూర్తిని గౌరవించే భారత జట్లతో తాము ఆడామని, అయితే ఈ మ్యాచ్‌లో యువ ఆటగాళ్ల ప్రవర్తన నిరాశ కలిగించిందని తెలిపారు.


మ్యాచ్ సమయంలో పాకిస్థాన్ డ్రెస్సింగ్ రూమ్ నుంచి వచ్చిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో సర్ఫరాజ్ తమ ఆటగాళ్లతో మాట్లాడుతూ.. “అజ్ఞానంతో ప్రవర్తించే వారిని చూసి మనం కూడా అలాగే ప్రవర్తించకూడదు. మర్యాదతోనే ఆట ఆడాలి” అని చెప్పినట్లు కనిపిస్తోంది. ఈ వ్యాఖ్యలు తానే చేసినవని సర్ఫరాజ్ అనంతరం మీడియా సమావేశంలో ధ్రువీకరించడం గమనార్హం.


Sarfaraz Ahmed
Pakistan Under 19
India Under 19
Asia Cup Final
Cricket
Sportsmanship
Sameer Minhas
Ayush Matre
Pakistan Cricket
Indian Cricket

More Telugu News