అఖండ 2 కోసం పండిట్ మిశ్రా బ్రదర్స్‌ను రంగంలోకి దింపిన తమన్

  • డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న అఖండ 2: తాండవం
  • వేదమంత్రోచ్చారణకు పండిట్ మిశ్రా బ్రదర్స్ 
తెరపై నందమూరి బాలకృష్ణ తాండవం చేస్తూ శత్రు సంహారం చేస్తుంటే, నేపథ్యంగా గంభీర స్వరంలో వినిపించే సంస్కృత శ్లోకాలు ప్రేక్షకుల్లో ఉర్రూతలూగించే అనుభూతిని కలిగిస్తాయి. అదే అనుభూతిని మళ్లీ పునరావృతం చేయడానికి సంగీత దర్శకుడు ఎస్‌.ఎస్‌. తమన్ సన్నద్ధమవుతున్నారు.

‘అఖండ 2: తాండవం’ సినిమా కోసం తమన్ ప్రత్యేకంగా పండిట్ శ్రవణ్ మిశ్రా, పండిట్ అతుల్ మిశ్రా సోదర ద్వయాన్ని రంగంలోకి దింపారు. సంస్కృత శ్లోకాలు, వేదమంత్రాల పఠనంలో నిష్ణాతులైన వీరి స్వరాలు సినిమాలోని బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌కి ఆధ్యాత్మికత, మహిమాన్వితత కలగజేస్తాయన్న నమ్మకంతో తమన్ ఈ ప్రయత్నం చేసినట్లు చిత్రబృందం వెల్లడించింది.

బాలకృష్ణ కథానాయకుడిగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఆధ్యాత్మికతతో కూడిన యాక్షన్ విజువల్ స్పెక్టకిల్‌గా తెరపైకి రానుంది. సంయుక్త కథానాయికగా నటిస్తుండగా, ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్రా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ భారీ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సమర్పకురాలు ఎం. తేజస్విని నందమూరి.

సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం డిసెంబరు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. తమన్ స్వరంలో శక్తిమంతమైన సంగీతం, మిశ్రా బ్రదర్స్ వేదోచ్చారణలు, బోయపాటి దర్శకత్వ దృక్పథం కలిసి ఈసారి బాక్సాఫీస్ వద్ద మరో అఖండ స్థాయిలో తాండవం చేయబోతున్నాయని పరిశ్రమ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

Thaman
Akhanda 2
Nandamuri Balakrishna
Boyapati Srinu
Sravan Mishra
Atul Mishra
Telugu movies
Tollywood
action movies
spiritual movies

More Telugu News