ఉప్పొంగుతున్న నదిలో నడుచుకుంటూ వెళ్లి టీకాలు వేసిన ఏఎన్ఎం

––
భారీ వర్షాలకు నది ఉప్పొంగుతున్నా వెరవకుండా, ప్రమాదమని తెలిసినా పట్టువిడవలేదా ఏఎన్ఎం, ఆశా వర్కర్లు.. నదిలో నడుచుకుంటూ వెళ్లి ఓ గర్భిణీకి, మరో బాలుడికి టీకాలు వేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రతి బుధ, శనివారాల్లో వైద్య సిబ్బంది గిరిజన గ్రామాలకు వెళ్లి వ్యాక్సినేషన్‌ నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలోనే సాలూరు మండలంలోని సుళ్లారిలో ఓ గర్భిణి, రెండేళ్ల బాలుడికి టీకాలు వేయాల్సి ఉంది. అయితే, సుళ్లారి వెళ్లాలంటే రోడ్డు మార్గంలేదు. సువర్ణముఖి దాటాల్సిందే. 

ఒడిశాలో కురుస్తున్న వర్షాలకు నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో నాటు పడవలు కూడా అందుబాటులో లేవు. ఎలాగైనా టీకాలు వేసి రావాల్సిందేనని నిర్ణయించుకున్న ఏఎన్ఎం సావిత్రి.. ఆశా వర్కర్ రుప్పమ్మ, మరో మహిళతో కలిసి నదిలో నడుచుకుంటూ వెళ్లి సుళ్లారి చేరుకున్నారు. గర్భిణితో పాటు బాలుడికి సమయానికి టీకాలు వేశారు. ఉప్పొంగుతున్న నదిని దాటి వచ్చి టీకాలు వేసిన ఏఎన్ఎం, ఆశా వర్కర్లకు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు. విధి నిర్వహణ విషయంలో వారు చూపిన తెగువను పలువురు అభినందిస్తున్నారు.

ANM Savitri
Parvathipuram Manyam district
vaccination
tribal villages
Sullari village
Suvarnamukhi river
pregnant woman
child vaccination
Andhra Pradesh health
ASHA worker

More Telugu News