భారత్ సుంకాలు విధిస్తూ చంపేస్తోంది: ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు

  • చైనా, బ్రెజిల్ కూడా భారీగా సుంకాలతో విరుచుకుపడుతోందన్న ట్రంప్
  • తమ దేశ వస్తువులపై ఆయా దేశాలు అధిక టారిఫ్ విధిస్తున్నాయని విమర్శ
  • అత్యధిక సుంకాలు విధిస్తున్న దేశం భారత్ అని ఆరోపణ
తమపై పలు దేశాలు సుంకాలు విధిస్తూ చంపేస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. "చైనా సుంకాలతో చంపేస్తోంది. భారతదేశం కూడా టారిఫ్ లతో మమ్మల్ని చంపుతోంది. బ్రెజిల్ కూడా భారీగా సుంకాలు విధిస్తోంది" అని ట్రంప్ వ్యాఖ్యానించారు. స్కాట్ జెన్నింగ్స్ రేడియో షో ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, టారిఫ్‌ల గురించి తనకు తెలిసినంతగా మరే దేశానికి అర్థం కాదని అన్నారు. భారత్‌పై 50 శాతం టారిఫ్ విధించడాన్ని ఆయన సమర్థించుకున్నారు.

తమ దేశ వస్తువులపై ఆయా దేశాలు అత్యధిక టారిఫ్ విధిస్తున్నాయని ఆయన ఆరోపించారు. తమ వస్తువులపై సుంకాలు ఉండవని ఢిల్లీ అంగీకరించిందని ఆయన అన్నారు. తాను తీసుకున్న చర్యలతో ఆయా దేశాలు టారిఫ్‌లపై దిగి వస్తున్నాయని తెలిపారు.

ప్రపంచంలో అత్యధిక సుంకాలు విధిస్తున్న దేశం భారత్ అని ఆయన ఆరోపించారు. తాను చర్యలు తీసుకోకపోతే వారు దిగి వచ్చేవారు కాదని అన్నారు. అందుకే సుంకాలు ఉండాలని, తద్వారా ఆర్థికంగా బలపడతామని ఆయన వ్యాఖ్యానించారు. వివిధ దేశాలపై విధిస్తున్న టారిఫ్‌లు అక్రమమని ఓ ఫెడరల్ అప్పీల్ న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలపై కూడా ట్రంప్ స్పందించారు. ఈ కేసును ఇతర దేశాలు స్పాన్సర్ చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.

Donald Trump
India tariffs
US tariffs
China tariffs
Brazil tariffs
Trade war
US trade policy
Tariff policy

More Telugu News