ప్రధాని గారూ... నా విద్యార్హతలు చెప్పుకోవడానికి నేనెప్పుడూ సిగ్గుపడను: ప్రకాశ్ రాజ్

  • ప్రధాని మోదీ డిగ్రీ వివాదంపై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు
  • సీఐసీ ఉత్తర్వుల కొట్టివేత
  • ప్రధానిని ఉద్దేశిస్తూ నటుడు ప్రకాశ్ రాజ్ ట్వీట్
"ప్రధాని గారూ... నాకు డిగ్రీ లేదు.. దాని గురించి నేను సిగ్గుపడను, ఆ విషయాన్ని దాచుకోను కూడా" అంటూ ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ తనదైన శైలిలో స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్హతల వివాదంపై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (బీఏ) డిగ్రీకి సంబంధించిన వివరాలను బయటపెట్టాల్సిన అవసరం లేదని ఢిల్లీ హైకోర్టు సోమవారం స్పష్టం చేసింది. ఈ మేరకు ఢిల్లీ యూనివర్సిటీకి (డీయూ) కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) 2016లో జారీ చేసిన ఆదేశాలను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. జస్టిస్ సచిన్ దత్తా ఈ తీర్పును వెలువరించారు.

ఈ తీర్పు నేపథ్యంలోనే ప్రకాశ్ రాజ్ స్పందించినట్టు తెలుస్తోంది. "భారత పౌరులకు, ప్రధానమంత్రికి బహిరంగ లేఖ. నేను ప్రకాశ్ రాజ్‌ను. నాకు డిగ్రీ లేదు. నా సృజనాత్మక వృత్తి కోసం చదువును మధ్యలోనే ఆపేశాను. దీనికి నేను సిగ్గుపడటం లేదు. దీన్ని దాచుకోవాలని కూడా అనుకోవడం లేదు" అని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు.

మోదీ విద్యార్హతలపై ఎప్పటినుంచో విపక్షాలు విమర్శలు చేస్తున్న తరుణంలో, కోర్టు తీర్పు రావడం, దానిపై ప్రకాశ్ రాజ్ ఇలా పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు సంధించడం మరోసారి ఈ అంశాన్ని చర్చనీయాంశంగా మార్చింది.

Prakash Raj
Narendra Modi
PM Modi
Delhi High Court
educational qualifications
degree controversy
Central Information Commission
CIC
Delhi University
political criticism

More Telugu News