బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి అరెస్టు... తీవ్రంగా స్పందించిన బండి సంజయ్

  • కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ బాటలోనే పయనిస్తోందని విమర్శ
  • అరెస్టులతో తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవాలని ప్రభుత్వం చూస్తోందని ఆగ్రహం
  • బీజేపీ నాయకులను అక్రమంగా అరెస్టు చేశారని ఈటల రాజేందర్ ఆగ్రహం
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అరెస్టును కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. చేవెళ్లలో పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతుండగా అరెస్టు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ బాటలోనే పయనిస్తోందని విమర్శించారు. అరెస్టులతో తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవాలని ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు. రాంచందర్ రావును, పార్టీ కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

అరెస్టులపై ఈటల రాజేందర్ ఆగ్రహం

బీజేపీ నాయకులను అక్రమంగా అరెస్టు చేశారని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. ఈ ప్రభుత్వం చేయాల్సింది అరెస్టులు కాదని, సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. నిరంకుశ విధానాలు మానకపోతే ప్రజాక్షేత్రంలో మట్టి కరవడం ఖాయమని జోస్యం చెప్పారు.

కాగా, జీహెచ్ఎంసీలో సమస్యల పరిష్కారం కోరుతూ బీజేపీ నేడు సచివాలయ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పలువురు నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. మొయినాబాద్ వద్ద పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Bandi Sanjay
Telangana BJP
Ramachandra Rao arrest
Etela Rajender
Telangana government
BJP protest

More Telugu News