కర్ణాటకలో కాంగ్రెస్ కలహాలు.. సీఎం పదవిపై డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు

  • సిద్ధరామయ్యతో విభేదాలను మరోమారు బయటపెట్టిన డీకే
  • అధికార భాగస్వామ్యంపై సిద్దూను పరోక్షంగా టార్గెట్ చేసిన కాంగ్రెస్ నేత
  • అందరూ సోనియాగాంధీలా ఉండలేరని వ్యాఖ్య
కర్ణాటక రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో తనకున్న విభేదాలను ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ బహిరంగంగా బయటపెట్టారు. సీఎం పదవిపై సంచలన వ్యాఖ్యలు చేసి, అధికార భాగస్వామ్యంపై పరోక్షంగా సిద్ధరామయ్యను టార్గెట్ చేశారు.

ఢిల్లీలో ఏఐసీసీ ఆధ్వర్యంలో జరిగిన 'రాజ్యాంగ సవాళ్లు' అనే కార్యక్రమంలో డీకే శివకుమార్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి తాను పడ్డ కష్టం, పార్టీకి చేసిన సేవలను ఆయన గుర్తు చేసుకున్నారు. అదే సమయంలో, గాంధీ కుటుంబాన్ని ప్రశంసిస్తూ, అధికార భాగస్వామ్యం గురించి పరోక్షంగా కీలక సందేశం ఇచ్చారు.

అధికారాన్ని వదులుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు
2004లో సోనియా గాంధీ ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసిన సందర్భాన్ని శివకుమార్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘అధికారం నాకు ముఖ్యం కాదు’ అంటూ సోనియా గాంధీ ఒక సిక్కు, అల్పసంఖ్యాకుడైన మన్మోహన్ సింగ్‌ను ప్రధానమంత్రిగా చేశారని ఆయన కొనియాడారు. "ఇంత పెద్ద త్యాగం ఈ ప్రజాస్వామ్యంలో ఇంకెవరైనా చేశారా? ఈ రోజుల్లో కనీసం ఒక చిన్న పంచాయతీ పదవిని కూడా వదులుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు" అని ఆయన వ్యాఖ్యానించారు.

శివకుమార్ ఎవరి పేరునూ నేరుగా చెప్పనప్పటికీ, ఆయన వ్యాఖ్యలు సిద్ధరామయ్యను ఉద్దేశించి చేసినవే అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇటీవల సిద్ధరామయ్య మాట్లాడుతూ తమ మధ్య ఎలాంటి అధికార భాగస్వామ్య ఒప్పందం లేదని, ఐదేళ్లూ తానే ముఖ్యమంత్రిగా ఉంటానని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో డీకే శివకుమార్ వ్యాఖ్యలు కర్ణాటక రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి.

DK Shivakumar
Karnataka politics
Siddaramaiah
Congress party
Chief Minister post
power sharing
political differences
Sonia Gandhi
Manmohan Singh
Karnataka CM

More Telugu News