ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు తీర్పు.. స్పందించిన అద్దంకి దయాకర్

  • స్పీకర్ అధికారాలను సుప్రీంకోర్టు ప్రశ్నించలేదన్న అద్దంకి దయాకర్
  • సుప్రీంకోర్టు కేవలం సూచనలు మాత్రమే చేస్తుందని వ్యాఖ్య
  • తీర్పు అనుకూలమని బీఆర్ఎస్ నాయకులు తెలివి తక్కువగా మాట్లాడుతున్నారని విమర్శ
ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు తీర్పుపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ స్పందించారు. ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ అధికారాలను సుప్రీంకోర్టు ప్రశ్నించలేదని, కేవలం సూచనలు మాత్రమే చేసిందని ఆయన అన్నారు. సభా హక్కులు కాపాడేది కేవలం స్పీకర్ మాత్రమేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పిందని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు తమకు అనుకూలమని బీఆర్ఎస్ నాయకులు తెలివితక్కువగా మాట్లాడుతున్నారని విమర్శించారు.

బీఆర్ఎస్ నాయకులు సుప్రీంకోర్టు తీర్పును చదవాలని సూచించారు. అధికారంలో ఉన్నప్పుడు పార్టీలను బీఆర్ఎస్‌లో విలీనం చేసుకున్న చరిత్ర కేసీఆర్‌దని అన్నారు. అధికారంలో ఉన్న పదేళ్లు బీఆర్ఎస్ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కిందని ఆయన విమర్శించారు. సీఎల్పీ నేతగా ఒక దళిత నాయకుడు ఉంటే సహించలేక కేసీఆర్ కాంగ్రెస్ శాసనసభా పక్షాన్ని విలీనం చేసుకున్నారని ఆరోపించారు.

కమ్యూనిస్టు పార్టీల అంతం చూడాలని కూడా కేసీఆర్ ప్రయత్నించారని మండిపడ్డారు. కానీ మేం అదే పార్టీలతో పొత్తు పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని బతికించామని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష హోదా ఉన్నా అసెంబ్లీకి రాని కేసీఆర్‌పై మేం కూడా కోర్టుకు వెళ్లాలా అని ప్రశ్నించారు. కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని, స్పీకర్ చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Addanki Dayakar
Telangana
Supreme Court
MLAs Disqualification
BRS Party
KCR

More Telugu News