ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి అరెస్టు వారెంట్ కు సిట్ పిటీషన్ .. రిజక్ట్ చేసిన ఏసీబీ కోర్టు .. ఎందుకంటే..?

  • ముందస్తు బెయిల్ మంజూరుకు సుప్రీంకోర్టు నిరాకరణ
  • అరెస్టు వారెంట్‌కు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సిట్ 
  • సుప్రీంకోర్టు మెమో, ఇతర పత్రాలు జత చేయకపోవడంతో రిటర్న్ చేసిన ఏసీబీ కోర్టు
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిపై అరెస్టు వారెంట్ జారీ చేయాలని కోరుతూ సిట్ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. మిథున్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన నేపథ్యంలో, నిన్న ఏసీబీ కోర్టులో మిథున్ రెడ్డిపై అరెస్టు వారెంట్ మంజూరు చేయాలని కోరుతూ సిట్ పిటిషన్ దాఖలు చేసింది.

అయితే, ఈ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది. సిట్ దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన మెమో, ఇతర పత్రాలు జత చేయకపోవడాన్ని గమనించి పిటిషన్‌ను వెనక్కి పంపింది. సంబంధిత పత్రాలతో పిటిషన్ దాఖలు చేయాలని సూచిస్తూ పిటీషన్‌ను తిరిగి ఇచ్చింది.

తొలుత హైకోర్టులో మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేయడంతోనే ఆయనపై సిట్ అధికారులు లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. ఆయన విదేశాలకు పారిపోకుండా అడ్డుకునేందుకు ఈ సర్క్యులర్ జారీ చేశారు. ప్రస్తుతం మిథున్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు.

తొలుత హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టు మిథున్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆయన నివాసాలు, కార్యాలయాల్లో చట్టప్రకారం సోదాలు జరిపేందుకు, అరెస్టు చేసేందుకు సిట్ అధికారులు చర్యలు చేపట్టే క్రమంలో భాగంగా ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. 

Mithun Reddy
AP Liquor Scam
Andhra Pradesh Liquor
SIT
ACB Court
Arrest Warrant
Supreme Court
Anticipatory Bail

More Telugu News