ఉత్తర కుమారుడి ప్రగల్భాలు ఆపండి: కేటీఆర్‌పై చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్

  • రైతు రాజ్యంపై చర్చకు రావాలని కేసీఆర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్
  • కేసీఆర్ బదులు తానే వస్తానంటూ స్పందించిన కేటీఆర్
  • కేటీఆర్ వ్యాఖ్యలపై భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు
  • కేటీఆర్‌వి ఉత్తర కుమారుడి ప్రగల్బాలంటూఎద్దేవా
  • ముందు ప్రతిపక్ష నేత కేసీఆర్‌ను అసెంబ్లీకి తీసుకురావాలని డిమాండ్
తెలంగాణలో రైతు రాజ్యం ఎవరి వల్ల సాధ్యమైందో తేల్చుకుందామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన సవాల్‌పై బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కేటీఆర్ ఇకనైనా ఉత్తర కుమారుడి ప్రగల్భాలు ఆపాలని, ఆయనకు సవాళ్లు అచ్చిరావని ఎద్దేవా చేశారు.

గతంలో కూడా కేటీఆర్ ఇలాగే సవాళ్లు విసిరి తప్పించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రభుత్వాన్ని సవాల్ చేసే స్థాయి, అర్హత కేటీఆర్‌కు లేవని ఆయన మండిపడ్డారు. ముందుగా, ప్రతిపక్ష నేత హోదాలో ఉండి కూడా అసెంబ్లీకి రాని తన తండ్రి కేసీఆర్‌ను ఫామ్‌హౌస్ నుంచి శాసనసభకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాతే చర్చల గురించి మాట్లాడాలని హితవు పలికారు.

అంతేకాకుండా, కేటీఆర్‌కు అంతగా ఆసక్తి ఉంటే తండ్రిని బతిమాలి ప్రతిపక్ష నేత హోదాను తాను తీసుకుని, ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చకు రావాలని సూచించారు. అలా కాకుండా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ తొడలు కొడితే ప్రజలు నవ్వుకుంటారని చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.

Chamala Kiran Kumar Reddy
KTR
Revanth Reddy
BRS
Congress
Telangana Politics
KCR

More Telugu News