టీడీపీ కార్యకర్తపై దాడి కేసులో మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు బెయిల్ మంజూరు

  • గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్
  • టీడీపీ కార్యకర్త ఇసుకపల్లి కృష్ణపై దాడి కేసులో మే 18న అరెస్టు చేసిన పోలీసులు
  • సురేశ్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన గుంటూరు జిల్లా కోర్టు
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ కు గుంటూరు జిల్లా కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. టీడీపీ కార్యకర్త ఇసుకపల్లి కృష్ణపై దాడి కేసులో ఆయనకు ఈ బెయిల్ లభించింది. ప్రస్తుతం సురేశ్  గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

సురేశ్ తన స్వగ్రామం తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో టీడీపీ కార్యకర్త ఇసుకపల్లి కృష్ణ (రాజు)పై మే 17న తన సోదరుడు నందిగం వెంకట్‌తో కలిసి విచక్షణారహితంగా దాడి చేయడంతో పాటు ఆ తర్వాత ఇంటికి తీసుకువెళ్లి బంధించారు. ఇంటి వద్ద సురేశ్ భార్య బేబి తదితరులు కూడా రాళ్లు, కర్రలతో కొట్టారు.

దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు మే 18న సురేశ్ ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా, రిమాండ్ విధించింది. ఆయన గతంలో పలుమార్లు బెయిల్ కోసం దరఖాస్తు చేయగా న్యాయస్థానం తిరస్కరించింది. మరోసారి కోర్టును ఆశ్రయించగా నిన్న షరతులతో బెయిల్ మంజూరు చేసింది.

కేసు దర్యాప్తు పూర్తయ్యే వరకు పోలీసులకు అందుబాటులో ఉండాలని, సాక్షులను బెదిరించకూడదని, నేరాలకు పాల్పడకూడదని, మూడు నెలల పాటు ప్రతి సోమవారం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 5 గంటల్లోపు పోలీస్ స్టేషన్‌లో హాజరుకావాలని న్యాయమూర్తి బెయిల్ షరతులుగా పేర్కొన్నారు. 

Nandigam Suresh
TDP activist attack
Guntur district court
YSRCP
Isukapalli Raju
Andhra Pradesh politics
Bail granted
Uddandarayunipalem
Nandigam Venkat
Tulluru

More Telugu News