కామారెడ్డిలో రేవంత్ రెడ్డి ఎందుకు ఓడిపోయారంటే: కాంగ్రెస్ నేత సంచలన ఆరోపణ

  • కామారెడ్డిలో రేవంత్ రెడ్డి ఓటమికి ఫోన్ ట్యాపింగే కారణమని హర్షవర్ధన్ రెడ్డి ఆరోపణ
  • గత ప్రభుత్వం తమ ఫోన్లు ట్యాప్ చేసిందని కాంగ్రెస్ నేత వాంగ్మూలం
  • ఎన్నికల సమయంలో తన ఫోన్ 16 రోజులు ట్యాప్ చేశారన్న హర్షవర్ధన్ రెడ్డి
  • టెలిగ్రఫీ చట్టం కింద చర్యలు తీసుకోవాలని డిమాండ్
తెలంగాణలో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సింగిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి సోమవారం సిట్ అధికారులకు వాంగ్మూలం ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత ప్రభుత్వ పెద్దలు తమ ఫోన్లను ట్యాప్ చేసి, తాము ఎవరితో సంభాషిస్తున్నామో, ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నామో తెలుసుకున్నారని ఆరోపించారు.

2023 శాసనసభ ఎన్నికల సమయంలో తాను కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌గా వ్యవహరించినట్లు హర్షవర్ధన్ రెడ్డి తెలిపారు. ఆ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఫోన్ ట్యాపింగ్ ద్వారా తమ వ్యూహాలను పసిగట్టడం వల్లే రేవంత్ రెడ్డి అక్కడ ఓటమి చవిచూడాల్సి వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో పోలీసులు అడుగడుగునా తమ వాహనాలను ఆపి తనిఖీలు చేసేవారని, అనేక ఇబ్బందులకు గురిచేశారని పేర్కొన్నారు. ఇటువంటి తప్పుడు పద్ధతులను అవలంబించి, గత ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచిందని ఆయన ఆరోపించారు.

కామారెడ్డిలో ఉన్నప్పుడు తన ఫోన్‌ను 16 రోజుల పాటు ట్యాప్ చేశారని హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. మఫ్టీలో ఉన్న పోలీసులు తమను నిరంతరం అనుసరించారని, తమ ఎన్నికల వ్యూహాలను పూర్తిగా తెలుసుకున్నారని తెలిపారు. కేంద్ర స్థాయి సంస్థలు చేపట్టాల్సిన ఫోన్ ట్యాపింగ్ ప్రక్రియను, తమను ఉగ్రవాదులుగా చిత్రీకరించి స్థానిక పోలీసులతో చేయించారని ఆయన అన్నారు.

ఈ వ్యవహారంలో రాజకీయ నాయకులతో పాటు, వ్యాపారవేత్తలు, న్యాయమూర్తులను కూడా వదల్లేదని ఆయన ఆరోపించారు. టెలిగ్రాఫ్ చట్టం కింద ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిట్ అధికారులను కోరినట్లు హర్షవర్ధన్ రెడ్డి తెలిపారు.

Revanth Reddy
Telangana
Phone Tapping Case
Kamareddy
Harshavardhan Reddy
Congress

More Telugu News