బనకచర్లపై కేసీఆర్ ఎందుకు మాట్లాడరు? ప్రగతిభవన్ కు జగన్ ను ఎందుకు పిలిపించుకున్నారు?: అద్దంకి దయాకర్

  • తెలంగాణ నీటి ప్రయోజనాలను బీఆర్ఎస్ తాకట్టు పెట్టిందన్న దయాకర్
  • బీఆర్ఎస్ తప్పులను కప్పిపుచ్చుకునేందుకే హరీశ్ రావు వ్యాఖ్యలని విమర్శ
  • తెలంగాణ హక్కుల పరిరక్షణకు సీఎం రేవంత్ కట్టుబడి ఉన్నారని వ్యాఖ్య
తెలంగాణ జలవనరులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా తాకట్టు పెట్టిందని, ఇప్పుడు ఆ పార్టీ నేతలు నీతి వాక్యాలు వల్లించడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తీవ్రస్థాయిలో ఆరోపించారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు నోరు విప్పడం లేదని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఆనాడు బనకచర్లకు కేసీఆరే అవకాశం కల్పించి, కళ్లు మూసుకుని కూర్చున్నారని విమర్శించారు.

కృష్ణా జలాల్లో తెలంగాణకు కేవలం 299 టీఎంసీల వాటాకు కేసీఆర్ ఎందుకు అంగీకరించారో చెప్పాలని అద్దంకి దయాకర్ డిమాండ్ చేశారు. "తెలంగాణ మీ అయ్య జాగీరా? అందుకేనా 299 టీఎంసీలకు ఒప్పుకున్నారు?" అని నిలదీశారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశాలకు కేసీఆర్ రెండుసార్లు గైర్హాజరయ్యారని గుర్తుచేశారు. జగన్‌తో కేసీఆర్ ఎందుకు స్నేహం చేశారో, ప్రగతిభవన్‌కు ఎందుకు పిలిపించుకున్నారో వెల్లడించాలని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే హరీశ్ రావు ఇప్పుడు బనకచర్ల అంశంపై మాట్లాడుతున్నారని ఆరోపించారు.

తెలంగాణ ప్రయోజనాలకు ఎలాంటి నష్టం వాటిల్లినా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నించి తీరుతుందని దయాకర్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడే దమ్ము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉందని, తెలంగాణకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగనివ్వబోమని ఆయన భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అన్యాయాలపై చర్చించాలని సీఎంను కోరనున్నట్లు తెలిపారు.


Addanki Dayakar
KCR
K Chandrasekhar Rao
Banakacherla project
Telangana
Krishna River
BRS party
Revanth Reddy
Jagan Mohan Reddy
Telangana irrigation projects

More Telugu News