ఘోర విమాన ప్రమాదం... గుజరాత్ సీఎంకు అమిత్ షా ఫోన్

  • అహ్మదాబాద్ లో కుప్పకూలిన ఎయిరిండియా విమానం
  • టేకాఫ్ అయిన క్షణాల్లోనే కూలిన విమానం
  • దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన అమిత్ షా
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఈ మధ్యాహ్నం పెను విషాదం చోటుచేసుకుంది. 242 మంది ప్రయాణికులతో లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన క్షణాల వ్యవధిలోనే కుప్పకూలింది. ఈ ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. 

జనావాసాల మధ్య విమానం కూలిపోయింది. విమానం కూలిన వెంటనే ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగ అలుముకుంది. కిలోమీటర్ల దూరం వరకు ఈ పొగలు కనిపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, ఇతర సహాయక బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి.

ఈ విమాన ప్రమాద ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన వెంటనే గుజరాత్ ముఖ్యమంత్రి, రాష్ట్ర హోంమంత్రి, పోలీస్ కమిషనర్‌లతో ఫోన్‌లో మాట్లాడి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. బాధితులకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని, అవసరమైన పూర్తి సహాయం అందిస్తామని ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు.

Amit Shah
Gujarat
Ahmedabad
Air India plane crash
विमान दुर्घटना
Chief Minister
Accident
Fire accident
Home Minister
Rescue operations

More Telugu News