మంగళగిరి టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసు.. సీఐడీ విచారణకు సజ్జల, అవినాష్ హాజరు

  • గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణ
  • సీఐడీ కార్యాలయం వద్ద పోలీసుల మోహరింపు
  • తోడుగా వచ్చిన మాజీ మంత్రులు అంబటి, విడదల రజని
వైసీపీ ప్రభుత్వ హయాంలో మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి ఘటనకు సంబంధించిన కేసులో వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి నేడు విచారణకు హాజరయ్యారు. గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో జరిగిన విచారణకు మరో నేత దేవినేని అవినాష్‌తో కలిసి హాజరయ్యారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి అప్పట్లో సంచలనమైంది. ఈ ఘటనకు సంబంధించి సజ్జల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో, సీఐడీ అధికారులు జారీ చేసిన నోటీసుల మేరకు గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.

విచారణకు వస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి వాహనాన్ని పోలీసులు కోర్టు రోడ్డు వద్దనే నిలిపివేశారు. దీంతో ఆయన అక్కడి నుంచి సీఐడీ కార్యాలయం వరకు నడుచుకుంటూ వెళ్లారు. సజ్జలకు సంఘీభావంగా మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజిని, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తదితరులు సీఐడీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐడీ కార్యాలయం పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి, దేవినేని అవినాష్‌ల వాంగ్మూలాలను సీఐడీ అధికారులు నమోదు చేసినట్లు సమాచారం.

Sajjala Ramakrishna Reddy
Devineni Avinash
CID inquiry
Mangalagiri TDP office attack
YSRCP
TDP
Andhra Pradesh Politics
Gudivada
Political Case
Crime Investigation

More Telugu News