పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను త్వరగా పూర్తి చేయాలి: ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • నీటి పారుదల శాఖ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం
  • ప్రాజెక్టు మొదటి దశను ఈ ఏడాది డిసెంబర్ లోపు పూర్తి చేయాలన్న మంత్రి
  • డిసెంబర్ నాటికి 50 టీఎంసీలు నిల్వ చేస్తామని వెల్లడి
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సత్వరం పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టు మొదటి దశను ఈ సంవత్సరం డిసెంబరు నాటికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ మేరకు నీటి పారుదల శాఖ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నార్లాపూర్, ఏదుల జలాశయాల మధ్య ఉన్న రెండో ప్యాకేజీ పనులను వేగంగా పూర్తి చేస్తామని తెలిపారు. కాలువల నిర్మాణ పనులను అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. జలాశయాల పనులను కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని వెల్లడించారు. డిసెంబర్ నాటికి పనులన్నీ పూర్తి చేసి 50 టీఎంసీల నీటిని నిల్వ చేస్తామని ఆయన పేర్కొన్నారు.

సబ్ స్టేషన్ల పనుల నిమిత్తం ట్రాన్స్‌కోకు రూ. 262 కోట్లు విడుదల చేశామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. జులై నెలలో పంపుల డ్రై రన్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జూరాల ప్రాజెక్టులో పూడికతీత పనులు చేపట్టాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

Uttam Kumar Reddy
Palamooru-Rangareddy Lift Irrigation Project
Telangana
Irrigation Project
Water Resources

More Telugu News