విశాఖలో ఐపీఎల్ మ్యాచ్‌లు.. హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన టికెట్లు

  • 24న ఢిల్లీ-లక్నో, 30న ఢిల్లీ-హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్‌లు
  • నిన్న సాయంత్రం 4 గంటలకు రూ. 1000 టికెట్ల విక్రయం 
  • ప్రారంభమైన నిమిషాల్లోనే ఖాళీ
  • టికెట్ల కోసం ఎదురుచూసిన అభిమానులకు నిరాశ
విశాఖపట్నంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్ల విక్రయాలు ప్రారంభమైన నిమిషాల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. దీంతో టికెట్ల కోసం ఆశగా ఎదురుచూసిన అభిమానులకు నిరాశే మిగిలింది. విశాఖలో ఈ నెల 24న ఢిల్లీ-లక్నో, 30న ఢిల్లీ-హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్‌లు జరగనున్నాయి. ఢిల్లీ-లక్నో మ్యాచ్ టికెట్ల విక్రయాలు నిన్న సాయంత్రం 4 గంటలకు డిస్ట్రిక్ట్ (జొమాటో) యాప్‌లో ప్రారంభమయ్యాయి. అప్పటికే టికెట్ల కోసం వేలాదిమంది అభిమానులు ఆన్‌లైన్‌లో వేచి చూస్తుండటంతో సేల్ ప్రారంభమైన నిమిషాల్లోనే రూ. 1000 టికెట్లు నిండుకున్నాయి.

ఢిల్లీ-హైదరాబాద్ మ్యాచ్ టికెట్లు ఎప్పుడు విక్రయిస్తారన్న విషయాన్ని అధికారులు ఇంకా వెల్లడించలేదు. కాగా, గతేడాది మార్చి 31న జరిగిన ఢిల్లీ-చెన్నై మ్యచ్‌కు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. గతంలో నకిలీ టికెట్ల విక్రయాలు జోరుగా సాగాయని, ప్రస్తుతం అలాంటి ఘటనలు ఎవరి దృష్టికైనా వస్తే పోలీసులకు తెలియజేయాలని, లేదంటే తన వ్యక్తిగత వాట్సాప్ నంబర్ 79950 95799కు ఫిర్యాదులు పంపాలని నగర పోలీస్ కమిషనర్ శంఖబత్ర బాగ్చీ తెలిపారు.

IPL 2025
Visakhapatnam
Delhi Capitals
SRH
LSG

More Telugu News