రేపు ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరో చెప్పిన రవిశాస్త్రి

  • ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా × న్యూజిలాండ్
  • టైటిల్ పోరుపై తన అభిప్రాయాలను పంచుకున్న రవిశాస్త్రి
  • ఇరు జట్లలో ఆల్ రౌండర్లు కీలక పాత్ర పోషిస్తారని వెల్లడి
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో రేపు (మార్చి9) ఫైనల్ మ్యాచ్ జరగనుంది. గ్రూప్-ఏ జట్లయిన టీమిండియా, న్యూజిలాండ్ ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ నేపథ్యంలో, టీమిండియా మాజీ కోచ్, క్రికెట్ వ్యాఖ్యాత రవిశాస్త్రి స్పందించాడు. దుబాయ్ లో ఇప్పటివరకు చూసిన పిచ్ లకు భిన్నంగా ఈసారి భారీ స్కోర్లు నమోదయ్యే పిచ్ రూపొందించే అవకాశం ఉందని తెలిపాడు. పిచ్ ను చూసిన తర్వాతే రెండు జట్లు తమ తుది జట్లను రూపొందిస్తాయని భావిస్తున్నట్టు వెల్లడించాడు. 

ఇక... ఫైనల్ మ్యాచ్ లో ఆల్ రౌండర్లే కీలకంగా మారతారని... టీమిండియా నుంచి అక్షర్ పటేల్ లేదా రవీంద్ర జడేజా... న్యూజిలాండ్ జట్టు నుంచి గ్లెన్ ఫిలిప్స్.... వీళ్లలో ఎవరో ఒకరు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవుతారని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. 

వీరే కాకుండా... టీమిండియాలో విరాట్ కోహ్లీ... కివీస్ జట్టులో కేన్ విలియమ్సన్, రచిన్ రవీంద్ర కూడా ప్రభావం చూపే అవకాశాలున్నాయని అన్నాడు. ఈ టోర్నీలో టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్ చేరిందని, అయితే టీమిండియాను ఓడించే సత్తా న్యూజిలాండ్ కు ఉందని పేర్కొన్నాడు. 

కాగా, టీమిండియా, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ ఆదివారం నాడు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది.

Champions Trophy 2025
Ravi Shastri
Team India
New Zealand
Final Match
Dubai

More Telugu News