రేవంత్ రెడ్డి గాలి మాటలకు ప్రజలే సమాధానం చెప్పారు: కిషన్ రెడ్డి

--
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి తనపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. రేవంత్ రెడ్డి గాలి మాటలకు సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం తనకు లేదన్నారు. ఆయన చేసిన ఆరోపణలకు ఎన్నికల్లో ప్రజలే సరైన తీర్పు ఇచ్చారని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించి కాంగ్రెస్ కు చెంపపెట్టులాంటి జవాబిచ్చారని కిషన్ రెడ్డి అన్నారు. ప్రజాతీర్పును గౌరవించి ఇకనైనా ఎన్నికల హామీల అమలుపై దృష్టి పెట్టాలంటూ రేవంత్ రెడ్డికి హితవు పలికారు.

ఈమేరకు హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రైతులకు ఎకరాకు రూ.15 వేలు, నిరుద్యోగ భృతి, మహిళలకు నెలనెలా రూ.2,500, దళితులకు రూ.12 లక్షలు, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామంటూ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తుచేశారు. ఈ హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా జీవో 317 కారణంగా ఇబ్బందులు పడుతున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు.

Kishan Reddy
Revanth Reddy
MLC Elections
Congress
BJP

More Telugu News