కేసీఆర్​ ఓ సీజనల్ ప్రతిపక్ష నేత.. జగ్గారెడ్డి ఎద్దేవా

PCC Working President Jaggareddy sensational comments on KCR
  • మాజీ సీఎం కేసీఆర్ పై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంచలన వ్యాఖ్యలు
  • ప్రజలను మోసం చేయడంలో కేసీఆర్ దిట్ట అంటూ విమర్శలు
  • మేము ఉఫ్ అని ఊదితే కొట్టుకుపోతాడన్న కాంగ్రెస్ నేత
కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు ఉఫ్ అని ఊదితే ఆ గాలికే కేసీఆర్ కొట్టుకుపోతారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సీజనల్ ప్రతిపక్ష నేతగా మారారని విమర్శించారు. శుక్రవారం ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్ లో కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. తాను కొడితే మామూలుగా కొట్టనని, గట్టిగానే కొడతానంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా జగ్గారెడ్డి స్పందించారు. గాంధీ భవన్ లో విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజలను మోసం చేయడంలో కేసీఆర్ దిట్ట అని, ఫాంహౌస్ లో కూర్చుని జనాలను ఇంకా ఎలా మోసం చేయాలా అని ఆలోచిస్తున్నాడని ఆరోపించారు. ఆయనను మోసగాళ్లకు మోసగాడని పిలవొచ్చన్నారు. ఆయనవి భక్వాస్ మాటలని కొట్టిపారేశారు.

పదేళ్లపాటు ముఖ్యమంత్రిగా కొనసాగిన కేసీఆర్.. సచివాలయంలో కనీసం మూడు రివ్యూలైనా చేయలేదన్నారు. ఆయన ఐదు లక్షల మందితో సభ పెడితే సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తాము ఐదు లక్షల ఒక వెయ్యి మందితో సభ పెడతామన్నారు. సాధారణంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తుంటారని గుర్తుచేస్తూ.. రాష్ట్రంలో మాత్రం ప్రభుత్వమే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తాం, సభకు వచ్చి మాట్లాడాలని ప్రతిపక్ష నేతను పిలుస్తోందని చెప్పారు. స్పీకర్ కూడా కేసీఆర్ ను పిలిచారని గుర్తుచేశారు. సీఎంగా ఉంటేనే సభకు వస్తారా.. ప్రతిపక్ష నేతగా ఉంటే అసెంబ్లీకి రారా అని జగ్గారెడ్డి నిలదీశారు.
Go Back to Shorts
Jagga Reddy
KCR
Congress
Cheater

More Telugu News