నితీశ్ కుమార్ రెడ్డిపై సీఎం చంద్రబాబు, విక్టరీ వెంకటేశ్ ప్రశంసల జల్లు

  • నాలుగో టెస్టులో సెంచరీ సాధించిన తెలుగు కుర్రాడు
  • విశాఖపట్నం యువకుడికి అభినందనలు అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ 
  • దేశ కీర్తిప్రతిష్టలను ఇనుమడింపజేయాలంటూ ఆకాంక్షించిన ముఖ్యమంత్రి
  • అద్భుత ప్రదర్శన చేశాడంటూ విక్టరీ వెంకటేశ్ ప్రశంసల జల్లు
భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మెల్‌బోర్న్‌లోని ప్రతిష్ఠాత్మక ఎంసీజీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో అద్భుతమైన శతకం సాధించిన తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డిపై ప్రశంసలు జల్లు కురుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కూడా నితీశ్‌కు అభినందనలు తెలిపారు. 

‘‘నాలుగో టెస్టు మ్యాచ్‌లో సెంచరీ సాధించిన విశాఖపట్నం యువకుడు కె. నితీశ్ కుమార్ రెడ్డికి నా అభినందనలు. టెస్టు మ్యాచ్‌లలో ఈ ఘనత సాధించిన భారతీయ క్రికెటర్లలో మూడో అతి పిన్న వయస్కుడు కూడా కావడం మరింత సంతోషం కలిగిస్తోంది. రంజీలో ఆంధ్రా తరపున ఎన్నో విజయాలు సాధించిన నితీశ్ కుమార్ రెడ్డి...  అండర్ 16లో కూడా అద్భుత విజయాలు అందుకున్నాడు. ఇలాంటి సెంచరీలు మరిన్ని సాధించాలని, భారత క్రికెట్ జట్టుకు చక్కటి ప్రదర్శన చేసి దేశ కీర్తిప్రతిష్టలను ఇనుమడింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.

విక్టరీ వెంకటేశ్ ప్రశంసలు
ఇక క్రికెట్‌ను ఎంతగానో ఇష్టపడే టాలీవుడ్ అగ్రనటుడు విక్టరీ వెంకటేశ్ కూడా నితీశ్ కుమార్ రెడ్డిపై ప్రశంసల జల్లు కురిపించాడు. ‘‘అద్భుతమైన ప్రదర్శన చేశాడు. 8వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి సెంచరీ సాధించాడు. వాషింగ్టన్ సుందర్‌తో కలిసి అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. తొలి టెస్ట్ సిరీస్‌లోనే నితీశ్ అద్భుత ప్రదర్శన చాలా గర్వంగా ఉంది’’ అంటూ వెంకటేశ్ పేర్కొన్నాడు.

Nitish Kumar Reddy
Cricket
Sports News
Chandrababu
Venkatesh Daggubati

More Telugu News