క్రిస్మస్ సెలవుల కోసం సొంతూరు వచ్చి.. క్రికెట్ ఆడుతూ కుప్పకూలిన యువ సాఫ్ట్ ఇంజినీర్

  • కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరంలో ఘటన
  • హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న సాయికుమార్
  • స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతుండగా గుండెపోటు
  • గ్యాస్ నొప్పి అనుకుని నీళ్లు తాగి మళ్లీ ఆడుతూ కుప్పకూలిన వైనం
క్రిస్మస్ సెలవుల కోసం సొంతూరు వచ్చిన యువకుడు క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరంలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. అంగలూరుకు చెందిన కొమ్మాలపాటి సాయికుమార్ (26) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. క్రిస్మస్ సెలవు రావడంతో ఆదివారం సొంతూరుకు వచ్చాడు. 

నిన్న కౌతవరం హైస్కూల్‌లో క్రికెట్ పోటీ ఉండడంతో స్నేహితులతో కలిసి వెళ్లాడు. కాసేపు ఆడిన తర్వాత ఛాతీలో నొప్పిగా అనిపించడంతో కూర్చుండిపోయాడు. ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు స్నేహితులు సిద్ధం కాగా, గ్యాస్ నొప్పి అనుకుని నీళ్లు తాగాడు. అలసట తగ్గాక మళ్లీ క్రికెట్ ఆడుతూ కుప్పకూలిపోయాడు.

అప్రమత్తమైన స్నేహితులు సీపీఆర్ చేయడంతో స్పృహలోకి వచ్చాడు. ఆ వెంటనే వారు అతడిని గుడ్లవల్లేరులోని ఆసుపత్రికి తరలించారు. అయితే, వైద్యులు ఆపరేషన్ థియేటర్లో ఉండటంతో మరో ఆసుపత్రికి తరలించారు. అక్కడ సాయికుమార్‌ను పరిశీలించిన వైద్యులు గుడివాడ తీసుకెళ్లాలని సూచించారు. గుడివాడ తీసుకెళ్లాక పరీక్షలు చేసిన వైద్యులు సాయికుమార్ అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు.

Tragic Incident
Krishna District
Gudlavalleru
Software Engineer

More Telugu News