జైలు నుంచి విడుదలైన లగచర్ల రైతులు.. స్వాగతం పలికిన బీఆర్ఎస్ నేతలు

Lagacharla farmers released from jail
  • సంగారెడ్డి జైలు నుంచి విడుదలైన 16 మంది రైతులు
  • ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతుల నినాదాలు
  • తమను అన్యాయంగా అరెస్ట్ చేశారని మండిపాటు
లగచర్ల ఘటనలో అరెస్టయిన 16 మంది లగచర్ల రైతులు సంగారెడ్డి జైలు నుంచి విడుదలయ్యారు. ఈ ఉదయం వీరంతా జైలు నుంచి బయటకు వచ్చారు. దాదాపు నెల రోజుల పాటు వీరు జైల్లో ఉన్నారు. జైలు నుంచి బయటకు వచ్చిన రైతులకు బీఆర్ఎస్ నేతలు, గిరిజన సంఘాలు స్వాగతం పలికాయి. 

మరోవైపు జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ... తమను అన్యాయంగ అరెస్ట్ చేశారని మండిపడ్డారు. ఘటన జరిగిన సమయంలో ఆ ప్రదేశంలో తాము లేమని చెప్పారు. అర్ధరాత్రి తమను అరెస్ట్ చేసి... పరిగి పోలీస్ స్టేషన్ లో చిత్రహింసలకు గురి చేశారని మండిపడ్డారు. తమకు పరిహారం, ఉద్యోగాలు ఇచ్చినా ప్రభుత్వానికి భూములు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. జైల్లో ఉన్న మిగిలిన రైతులకు కూడా బెయిల్ ఇప్పించాలని కోరారు. తమ గ్రామానికి చెందిన శేఖర్ అనే వ్యక్తి ఈ గొడవకు కారణమని... ఆయనను ఇంతవరకు అరెస్ట్ చేయలేదని చెప్పారు. శేఖర్ ను విచారిస్తే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. 

జైలు నుంచి విడుదలైన రైతులకు నాంపల్లి కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. అయితే, బెయిల్ పత్రాలు నిన్న ఆలస్యంగా జైలు అధికారులకు చేరాయి. దీంతో, రైతులు నిన్న విడుదల కాలేదు. ఈ క్రమంలో ఈ ఉందయం వీరు జైలు నుంచి విడుదలయ్యారు.
Go Back to Shorts
Lagacharla Farmers
Release

More Telugu News