కుల్గాంలో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు ఉద్రవాదుల హతం

  • కుల్గాంలోని ఓ ఇంటిలో ఉగ్రవాదులు దాక్కున్నట్టు సమాచారం
  • సంయుక్త ఆపరేషన్ నిర్వహించిన జమ్మూకశ్మీర్ పోలీసులు, భద్రతా బలగాలు
  • ఈ ఏడాది జరిగిన రెండో అతి పెద్ద ఎన్‌కౌంటర్ ఇదే
జమ్మూకశ్మీర్‌లోని కుల్గాంలో ఈ ఉదయం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. ఉగ్రవాదుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్న అనంతరం వారిని గుర్తిస్తామని ఆర్మీ అధికారులు తెలిపారు. దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాంలోని ఓ ఇంట్లో నలుగురైదుగురు ఉగ్రవాదులు తలదాచుకున్నట్టు సమాచారం అందుకున్న జమ్మూకశ్మీర్ పోలీసులు, ఆర్మీ అధికారులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. 

ఉగ్రవాదులు తలదాచుకున్న ఇంటిని భద్రతా బలగాలు చుట్టుముట్టడాన్ని గ్రహించిన తీవ్రవాదులు బయటకు వచ్చి విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది ఎదురుకాల్పులు ప్రారంభించారు. కాల్పులు ఆగిన తర్వాత చూస్తే ఐదుగురు ఉగ్రవాదుల మృతదేహాలు కనిపించాయి. ఈ ఏడాది కుల్గాంలో జరిగిన రెండో అతిపెద్ద ఎన్‌కౌంటర్ ఇదేనని అధికారులు తెలిపారు. జులై 8న ఇక్కడ జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఆరుగురు మిలిటెంట్లు హతమవగా ఇద్దరు సైనికులు అమరులయ్యారు. 

Encounter
Jammu And Kashmir
Kulgam
Indian Army

More Telugu News