తెలంగాణ ప్రభుత్వం తొందరపడింది... అల్లు అర్జున్ అరెస్ట్ పై బొత్స వ్యాఖ్యలు

  • సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్
  • అరెస్ట్ సరికాదన్న బొత్స
  • సున్నితమైన అంశాల్లో ఆలోచించి అడుగేయాలని హితవు
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో మహిళ మృతికి హీరో అల్లు అర్జున్ ను బాధ్యుడ్ని చేస్తూ, అరెస్ట్ చేయడం సరికాదన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. వైసీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. 

అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం ద్వారా ప్రభుత్వం తొందరపాటు చర్యకు పాల్పడిందని వ్యాఖ్యానించారు. గతంలో గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట జరిగి పలువురు చనిపోయారని, ఆ ఘటనకు ఎవర్ని బాధ్యులుగా చేశారని బొత్స ప్రశ్నించారు. సున్నితమైన అంశాల్లో చర్యలు తీసుకునేటప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఆలోచించి అడుగేయాలని హితవు పలికారు. 

సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో మహిళ మృతి చెందడం బాధాకరమని, కానీ అధికారంలో ఉన్నవాళ్లు సంయమనం పాటించాలని సూచించారు. ఈ ఘటనలో పోలీసుల వైఫల్యం ఉందని భావిస్తున్నట్టు బొత్స తెలిపారు.

Allu Arjun
Arrest
Botsa
YSRCP
Andhra Pradesh

More Telugu News