ఆరెస్సెస్ అధినేత వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన రేణుకా చౌదరి

  • మహిళలు ఏమైనా కుందేళ్లా? అని ఆగ్రహం
  • పిల్లల్ని కంటే ఉద్యోగాలు దొరికే పరిస్థితి కూడా లేదని వ్యాఖ్య
  • పెరుగుతున్న ధరలపై రేణుకా చౌదరి ఆందోళన
వరుసగా పిల్లలను కనడానికి మహిళలు ఏమైనా కుందేళ్లా? అని కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి మండిపడ్డారు. ప్రతి జంట ముగ్గురు పిల్లలను కనాలని ఆరెస్సెస్ సర్ సంఘ్‌ చాలక్ మోహన్ భగవత్ ఇటీవల పిలుపునిచ్చారు. దేశంలో జనాభా వృద్ధి రేటు తగ్గుదలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మహిళా నేత రేణుకా చౌదరి తీవ్రంగా స్పందించారు.

దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని, పిల్లల్ని కంటే ఉద్యోగాలు దొరికే పరిస్థితి కూడా లేదన్నారు. ఉద్యోగం లేని అబ్బాయిలకు అమ్మాయిలను ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రారన్నారు. మోహన్ భగవత్ ఎక్కువమంది పిల్లలను కనాలని చెబుతున్నాడని, కానీ అలా కనేందుకు మహిళలు కుందేళ్లు కాదన్నారు.

ఈ మాటలు చెప్పేవాళ్లు ఎంతమంది పిల్లలను పెంచగలరు? అని ప్రశ్నించారు. అలా మాట్లాడేవారి అనుభవాలు ఏమిటో బాగా తెలుసని వ్యాఖ్యానించారు. దేశంలో పెరుగుతున్న ధరలపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరైనా అనారోగ్యంతో ఆసుపత్రి పాలైతే చికిత్సకయ్యే ఖర్చు భారీగా ఉంటోందన్నారు.

Renuka Chaudhary
Congress
Mohan Bhagwat
RSS

More Telugu News