అనుమతుల్లేకుండా కట్టిన ఇళ్లు పేదవారివైనా కూల్చక తప్పదు: హైడ్రా కమిషనర్ కీలక వ్యాఖ్యలు

Hydra Commissioner Ranganath interesting comments on demolitions
  • అక్రమ నిర్మాణాలపై మానవత్వంతో ఆలోచిస్తే సమాజం బాధపడవల్సి వస్తుందని వ్యాఖ్య
  • కొన్నిసార్లు మనసును చంపుకొని పని చేయాల్సి ఉంటుందన్న హైడ్రా కమిషనర్
  • చెరువులను పునరుద్ధరించాలంటే ఇళ్లు కూల్చాల్సిన అవసరం లేదని స్పష్టీకరణ
  • తప్పుడు అనుమతులతో కట్టిన ఇళ్లను హైడ్రా కూలుస్తుందని వెల్లడి
అనుమతులు లేకుండా కట్టిన ఇల్లు పెద్దవాళ్లవైనా... పేదవారివైనా కూల్చక తప్పదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. అక్రమ నిర్మాణాల విషయంలో మానవత్వంతో ఆలోచించాల్సి వస్తే సమాజమంతా బాధపడవలసి వస్తుందని, కాబట్టి కొన్నిసార్లు మనసును చంపుకొని పనిచేయాల్సి వస్తుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఎఫ్‌టీఎల్ పరిధిలోని అక్రమ నిర్మాణాల తొలగించడంతో పాటు చెరువుల్లో కొత్త నిర్మాణాలు లేకుండా అడ్డుకోవడమే హైడ్రా బాధ్యత అన్నారు. 

చెరువు ఎఫ్‌టీఎల్ పరిధికి సంబంధించి నీటి విస్తీర్ణం, సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్, విలేజ్ మ్యాప్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు చెప్పారు. అమీన్‌పూర్ చెరువు తూములు మూసేయడం వల్లనే లేఅవుట్‌లు మునిగినట్లు చెప్పారు. ఎఫ్‌టీఎల్ లెవల్‌ను పరిగణనలోకి తీసుకొని చెరువులను సర్వే చేయిస్తామన్నారు. తప్పుడు అనుమతులతో కట్టిన ఇళ్లను, అనుమతులను రద్దు చేసిన ఇళ్లను మాత్రమే కూల్చేస్తున్నట్లు చెప్పారు.

కొంతమందిపై చర్యలు తీసుకోవడం వల్ల హైడ్రా చేస్తున్న పని అందరికీ తెలుస్తోందన్నారు. హైడ్రా కారణంగా ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లపై చర్చ జరుగుతోందని, అందరికీ వీటి గురించి అవగాహన వచ్చిందన్నారు. అక్రమ నిర్మాణాల నియంత్రణకు అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నట్లు చెప్పారు. చెరువులు ఆక్రమణలకు గురికాకుండా స్థానికులు కూడా నిఘా పెడుతున్నారన్నారు.
Go Back to Shorts
HYDRA
Ranganath
Hyderabad
Telangana

More Telugu News