విజయసాయిరెడ్డిపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్... విచారణ వాయిదా

  • విజయసాయిపై ఐసీఏఐ నోటీసులు
  • నోటీసులను రద్దు చేసిన హైకోర్టు సింగిల్ బెంచ్
  • డివిజన్ బెంచ్ లో సవాల్ చేసిన ఐసీఏఐ
ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై ఇన్ స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) దాఖలు చేసిన పిటిషన్ పై ఈరోజు తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. వ్యక్తిగత దుష్ప్రవర్తనపై విజయసాయిని విచారించాలని ఐసీఏఐ నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులను రద్దు చేయాలంటూ విజయసాయి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

ఈ నోటీసులను రద్దు చేస్తూ గతంలో హైకోర్టు సింగిల్ బెంచ్ ఉత్తర్వులు ఇచ్చింది. సింగిల్ బెంచ్ ఆదేశాలను ఐసీఏఐ డివిజన్ బెంచ్ లో సవాల్ చేసింది. వృత్తిపరమైన ప్రవర్తన నియమావళిని విజయసాయి ఉల్లంఘించారని, ఆయనపై విచారణకు అనుమతినివ్వాలని ఐసీఏఐ కోరింది. కేసు పూర్వపరాలను పరిశీలించకుండానే నోటీసులను రద్దు చేయడం సరి కాదని తెలిపింది. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

Vijayasai Reddy
YSRCP

More Telugu News