ఏపీకి వాయుగుండం ముప్పు... హోంమంత్రి అనిత సమీక్ష

  • తుపాను హెచ్చరికలతో హోంమంత్రి అనిత అధికారులతో సమీక్ష
  • అప్రమత్తంగా ఉండాలంటూ కలెక్టర్లకు ఆదేశాలు
  • ఫోన్ లు, సందేశాల ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్న విపత్తు నిర్వహణ సంస్థ
దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడి పశ్చిమ వాయవ్య దిశగా పయనించి తుపానుగా మారే అవకాశం ఉండడంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఏపీ హోం, విపత్తు నిర్వహణ శాఖల మంత్రి వంగలపూడి అనిత అధికారులతో సమీక్ష జరిపారు.

తాడేపల్లిలోని విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయానికి చేరుకున్న మంత్రి అనిత జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు సూచనలు చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలను ఫోన్‌లు, సందేశాల ద్వారా విపత్తు నిర్వహణ సంస్థ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది. తుపాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లాల యంత్రాంగాలను తగు విధంగా సంసిద్ధంగా ఉంచాలని మంత్రి అనిత తెలిపారు. సహాయక చర్యల నిమిత్తం ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు.

చిత్తూరు, కర్నూలు, నెల్లూరు, నంద్యాల, తిరుపతి, ప్రకాశం జిల్లాలలోని ప్రతి మండలంలో ఇప్పటికే కమాండ్ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామన్నారు. విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియాతో కలిసి తుపాను ప్రభావ పరిస్థితులను డిజిటల్ విధానంలో పరిశీలించారు. మత్స్యకారులు, రైతులు, గొర్రెల కాపరులు తుపాను ప్రభావం తగ్గే వరకూ బయటికి వెళ్లవద్దని మంత్రి అనిత సూచించారు. 

Vangalapudi Anitha
Andhra Pradesh
Cyclone

More Telugu News