రామ్ చరణ్ తో కలిసి ప్రకటించిన కోటి రూపాయల విరాళం చెక్‌ల‌ను సీఎం చంద్రబాబుకు అంద‌జేసిన చిరంజీవి

  • ఇటీవల ఏపీ, తెలంగాణలో వరద బీభత్సం
  • రామ్ చరణ్ రూ.1 కోటి, చిరంజీవి రూ.1 కోటి విరాళం ప్రకటించిన వైనం
  • ఇవాళ చంద్రబాబును కలిసి చెక్ లు అందించిన చిరు
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఈ రోజు  హైదరాబాదులో కలిశారు. చంద్రబాబు నివాసానికి వచ్చిన చిరంజీవి... ఇటీవల ఏపీలో వరద బాధితుల సహాయార్థం తనయుడు రామ్ చరణ్ తో కలిసి ప్రకటించిన కోటి రూపాయల విరాళం తాలూకు చెక్ ను చంద్రబాబుకు అందించారు.  ఈ సందర్భంగా చంద్రబాబు రాష్ట్ర ప్రజల తరఫున చిరంజీవికి, రామ్ చరణ్ కు కృతజ్ఞతలు తెలిపారు.

ఇటీవ‌ల ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో భారీ వ‌ర్షాలతో వ‌ర‌ద‌లు సంభ‌వించి ప్ర‌జ‌లు అనేక ఇబ్బందులు ప‌డ్డారు. ఈ నేప‌థ్యంలో సినీ ప‌రిశ్ర‌మ త‌మ వంతుగా ఏపీ ప్ర‌భుత్వానికి మ‌ద్ధ‌తుని ప్ర‌క‌టిస్తూ విరాళాల‌ను అంద‌జేసింది. ప్ర‌జ‌లు ఇబ్బందుల్లో ఉన్న ప్ర‌తిసారి సినీ ప‌రిశ్ర‌మ నుంచి త‌న వంతు మ‌ద్ధతుని చిరంజీవి, ఆయన కుటుంబం తెలియ‌చేస్తుంటుంద‌నే సంగ‌తి తెలిసిందే. అటు, తెలంగాణలోన వరద బీభత్సం నెలకొంది. 

ఈ క్ర‌మంలో చిరంజీవి, ఆయ‌న త‌నయుడు రామ్ చ‌ర‌ణ్ తెలుగు రాష్ట్రాల‌కు చెరో రూ. కోటి చొప్పున భారీ విరాళాన్ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. చిరంజీవి ఏపీకి రూ.50 లక్షలు, తెలంగాణకు రూ.50 లక్షలు... రామ్ చరణ్ ఏపీకి రూ.50 లక్షలు, తెలంగాణకు రూ.50 లక్షలు విరాళంగా ప్రకటించారు. అందులో భాగంగా నేడు చంద్ర‌బాబును క‌లిసిన చిరంజీవి త‌న యాబై ల‌క్ష‌ల రూపాయల‌ చెక్‌తో పాటు, రామ్ చ‌ర‌ణ్ యాబై ల‌క్ష‌ల రూపాయ‌ల చెక్‌ను.. మొత్తం కోటి రూపాయ‌ల చెక్‌ల‌ను అంద‌జేశారు.


Chandrababu
Chiranjeevi
Ramcharan
Donations
Floods
Andhra Pradesh
Telangana
Tollywood

More Telugu News