తిరుపతిలో 'వారాహి డిక్లరేషన్' విడుదల చేసిన పవన్ కల్యాణ్.. వివరాలు ఇవిగో!

  • తిరుపతిలో వారాహి సభ
  • 7 అంశాలతో కూడిన డిక్లరేషన్ విడుదల
  • సనాతన ధర్మ పరిరక్షణ గురించి ప్రస్తావించిన పవన్
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారంటూ ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేసిన తర్వాత... డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సనాతన ధర్మం గురించి తరచుగా తన బాణీ వినిపిస్తున్నారు. తిరుపతిలో ఇవాళ నిర్వహించిన సభలో పవన్ 'వారాహి డిక్లరేషన్' విడుదల చేశారు. ఈ డిక్లరేషన్ లో సనాతన ధర్మ పరిరక్షణ గురించి ప్రస్తావించారు. మొత్తం 7 అంశాలతో ఈ డిక్లరేషన్ రూపొందించారు. 

1. ఏ మతానికి, ఏ ధర్మానికి భంగం  వాటిల్లినా ఒకేలా స్పందించే విధంగా లౌకిక వాదాన్ని పాటించాలి.
2. సనాతన ధర్మ పరిరక్షణ కోసం, ఆ విశ్వాసాలకు భంగం కలిగించే చర్యలు అరికట్టడానికి దేశం మొత్తం అమలయ్యేలా ఒక బలమైన చట్టం అవసరం ఉంది. తక్షణమే అలాంటి చట్టాన్ని తీసుకురావాలి.
3. సనాతన ధర్మ పరిరక్షణ కోసం తీసుకువచ్చే చట్టాన్ని అమలు చేసేలా జాతీయ, రాష్ట్ర స్థాయిలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కావాలి.
4. సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రతి ఏటా నిధులు కేటాయించాలి.
5. సనాతన ధర్మాన్ని కించపరిచి, ద్వేషం చిందించే వ్యక్తులకు, వ్యవస్థలకు సహాయ నిరాకరణ జరగాలి.
6. ఆలయాల్లో నిత్యం జరిగే నైవేద్యాలు, ప్రసాదాలలో వినియోగంచే వస్తువుల స్వచ్ఛతను ధృవీకరించే విధానాన్ని తీసుకురాలి.
7. ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా మాత్రమే కాకుండా... విద్యా కేంద్రాలుగా, కళా కేంద్రాలుగా, ఆర్థిక కేంద్రాలుగా, పర్యావరణ పరిరక్షణ కేంద్రాలుగా, సంక్షేమ కేంద్రాలుగా కూడా పూర్తిస్థాయిలో రూపుదిద్దుకోవాలి. ఆ దిశగా ఒక ప్రణాళిక సిద్ధం చేయాలి.

Pawan Kalyan
Varahi Declaration
Janasena
Tirupati

More Telugu News