పారిపోవడం అనేది సమాజానికి ప్రమాదకర సందేశాన్ని ఇస్తుంది: జానీ మాస్టర్ వ్యవహారంపై మంచు మనోజ్ వ్యాఖ్యలు

  • జానీ మాస్టర్ పై అత్యాచార ఆరోపణలు
  • గోవాలో అరెస్ట్ చేసిన పోలీసులు
  • జానీ మాస్టర్ నిజాన్ని ఎదుర్కోవాలన్న మంచు మనోజ్
  • తప్పు చేసి ఉంటే అంగీకరించాలని హితవు
అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటూ పరారీలో ఉన్న టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను గోవాలో అరెస్ట్ చేయడంపై నటుడు మంచు మనోజ్ స్పందించారు. 

ఒక మహిళ ఆరోపణలు చేసినప్పుడు పారిపోవడం అనేది సమాజానికి, భావితరాలకు ప్రమాదకర సందేశాన్నిస్తుందని అభిప్రాయపడ్డారు. జానీ మాస్టర్ నిజాన్ని ఎదుర్కొని పోరాడాలని... ఏ తప్పు చేయకపోతే ధైర్యంగా నిలబడి పోరాడాలని హితవు పలికారు. ఒకవేళ మీరు తప్పు చేసి ఉంటే ఆ విషయాన్ని అంగీకరించండి అని మంచు మనోజ్ స్పష్టం చేశారు. 

"జానీ మాస్టర్... మీరు కెరీర్ లో ఉన్నత స్థానానికి ఎదగడానికి ఎంత కష్టపడ్డారో అందరికీ తెలుసు... కానీ మీపై ఈస్థాయిలో ఆరోపణలు రావడం చూస్తుంటే గుండె బద్దలవుతోంది. ఎవరిది తప్పు అనేది చట్టం చూసుకుంటుంది. 

ఈ వ్యవహారంలో వెంటనే చర్యలు తీసుకున్న పోలీసులకు అభినందనలు తెలుపుతున్నాను. చట్టానికి ఎవరూ అతీతులు కారన్న విషయం దీనితో స్పష్టమవుతోంది" అని మంచు మనోజ్ పేర్కొన్నారు.

Jani Master
Manchu Manoj
Arrest
Tollywood

More Telugu News