రోహిత్, కోహ్లీని వెనక్కి పంపిన ఎవరీ హసన్ మహమూద్?

  • శ్రీలంకపై టెస్టు అరంగేట్రం చేసిన మహమూద్
  • పాకిస్థాన్‌పై ఐదు వికెట్ల ఘనత సాధించి వెలుగులోకి
  • భారత్‌పై నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడుతున్న ఫాస్ట్ బౌలర్
  • వన్డేల్లో 30, టీ20ల్లో 18 వికెట్లు నేలకూల్చిన యువ పేసర్
చెన్నైలో భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో  బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ హసన్ మహమూద్ నిప్పులు చెరిగే బంతులతో భారత బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నాడు. రోహిత్‌శర్మ, విరాట్ కోహ్లీ, శుభమన్ గిల్, రిషభ్‌పంత్ వంటి స్టార్ల వికెట్లను తీసుకుని షాకిచ్చాడు. అతడి దెబ్బకు 96 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన టీమిండియా కష్టాల్లో పడింది. 

తొలి నాలుగు వికెట్లు తీసి భారత్‌ను కష్టాల్లోకి నెట్టిన హసన్ మహమూద్ ఎవరన్న చర్చ అప్పుడే మొదలైంది. 24 ఏళ్ల మహమూద్ మార్చి 2020లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఎక్కువగా పరిమిత ఓవర్ల క్రికెట్‌ ఆడిన మహమూద్ ఈ ఏడాది మొదట్లో శ్రీలంకతో జరిగిన సిరీస్‌తో టెస్టుల్లో అడుగుపెట్టాడు. ఇటీవల పాకిస్థాన్‌తో జరిగిన రెండో టెస్టులో ఐదు వికెట్లు పడగొట్టి ఒక్కసారి ఫేమస్ అయ్యాడు. పాకిస్థాన్‌పై టెస్టు సిరీస్‌ను 2-0తో గెలుచుకుని చరిత్ర సృష్టించడంలో మహమూద్ కీలక పాత్ర పోషించాడు. చెన్నై టెస్టుకు ముందు మూడు టెస్టుల్లో మహమూద్ 14 వికెట్లు తీసుకున్నాడు. వన్డేల్లో 30, టీ20ల్లో 18 వికెట్లు నేలకూల్చాడు.

Hasn Mahmud
Bangladesh
Team India
Chennai Test

More Telugu News