హుస్సేన్ సాగర్‌లో గణేశ్ నిమజ్జనంపై హైకోర్టు కీలక ఆదేశాలు

  • సాగర్‌లో మట్టి, ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలను నిమజ్జనం చేయవచ్చన్న హైకోర్టు
  • పీవోపీ విగ్రహాలను మాత్రం తాత్కాలిక నీటి కుంటల్లో నిమజ్జనం చేయాలని ఆదేశాలు
  • నిమజ్జనం విషయంలో 2021లో రూపొందించిన మార్గదర్శకాలనే పాటించాలని సూచన
హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్‌లో గణేశ్ నిమజ్జనాలపై తెలంగాణ హైకోర్టు స్పష్టతను ఇచ్చింది. సాగర్‌లో మట్టి, ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలను నిమజ్జనం చేయవచ్చని హైకోర్టు వెల్లడించింది. పీవోపీ (ప్లాస్టర్ ఆఫ్ పారిస్)తో తయారైన విగ్రహాలను మాత్రం జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన తాత్కాలిక లేదా కృత్రిమ నీటికుంటల్లో నిమజ్జనం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. నిమజ్జనం విషయంలో 2021లో రూపొందించిన మార్గదర్శకాలనే పాటించాలని సూచించింది.

హుస్సేన్ సాగర్‌లో గణేశ్ విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టు ఆదేశాలను అమలు చేయడం లేదని దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. పిటిషనర్ కోర్టు ధిక్కార ఆధారాలు చూపలేకపోయారని తెలిపింది. నిమజ్జనం చివరి సమయంలో ధిక్కార పిటిషన్ సరికాదని హైకోర్టు పేర్కొంది.

అలాగే, హైడ్రాను ప్రతివాదిగా చేర్చలేమని హైకోర్టు స్పష్టం చేసింది. గత ఆదేశాల సమయంలో హైడ్రా లేదని తెలిపింది. అలాంటప్పుడు ప్రతివాదిగా ఎలా చేర్చుతామని ప్రశ్నించింది. పీవోపీ విగ్రహాల తయారీపై నిషేధం విధించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రత్యేక ఆదేశాల కోసం అవసరమైతే పిటిషనర్ రిట్ దాఖలు చేయవచ్చునని సూచించింది.

Hussain Sagar
Vinayaka Chavithi
Ganesh Immersion
Hyderabad
TS High Court

More Telugu News