ఎన్నికలకు ముందు చెప్పినట్లు ఏఐకి తొలి ప్రాధాన్యత ఇస్తున్నాం: రేవంత్ రెడ్డి

  • గ్లోబల్ ఏఐ సదస్సులో 'ఫ్యూచర్ సిటీ' లోగోను ఆవిష్కరించిన సీఎం
  • సరికొత్త ఆవిష్కరణలు ప్రపంచాన్ని మార్చివేశాయన్న ముఖ్యమంత్రి
  • విప్లవాత్మక మార్పులకు హైదరాబాద్ మాదిరి ఏ నగరమూ సిద్ధంగా లేదన్న సీఎం
  • ఏఐ ద్వారా భవిష్యత్తుకు బలమైన పునాదులు వేశామన్న రేవంత్ రెడ్డి
ఎన్నికలకు ముందు డిక్లరేషన్‌లో చెప్పినట్లుగా ఏఐకి తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో రాష్ట్ర ఐటీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 'గ్లోబల్ ఏఐ' సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మించబోయే 'ఫ్యూచర్ సిటీ' లోగోను ఆయన ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... సరికొత్త ఆవిష్కరణలు ప్రపంచాన్ని మార్చివేశాయన్నారు. నేటి తరం అద్భుత ఆవిష్కరణే ఏఐ అని పేర్కొన్నారు. కొత్త కొత్త ఆవిష్కరణలు ప్రజల జీవితాల్లో మార్పును తీసుకువస్తాయన్నారు. అవి ఆశలతో పాటు భయాన్ని కూడా తీసుకువస్తాయన్నారు.

విప్లవాత్మక మార్పులకు హైదరాబాద్ తప్పించి, మరే నగరం కూడా సిద్ధంగా లేదన్నారు. ఏఐ ద్వారా భవిష్యత్తుకు బలమైన పునాదులు వేశామన్నారు. నాస్కాం సహకారంతో ఏఐ ఫ్రేమ్ వర్క్‌కు రూపకల్పన జరుగుతున్నట్లు తెలిపారు. ఆవిష్కరణలకు సంబంధించి నిపుణులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందన్నారు. అందరం కలిసికట్టుగా సరికొత్త భవిష్యత్తును ఆవిష్కరించుదామన్నారు.

Revanth Reddy
Future City
AI City
Hyderabad
Telangana

More Telugu News