సెప్టెంబరు చివరి నాటికి టీడీఆర్ బాండ్ల అక్రమాలు తేలుస్తాం: మంత్రి నారాయణ

  • తిరుపతిలో టీడీఆర్ బాండ్ల అక్రమాలు
  • స్పందించిన మంత్రి నారాయణ
  • టీడీఆర్ బాండ్ల అక్రమాలపై కమిటీ వేశామని వెల్లడి
  • కమిటీ నివేదిక వచ్చాక తదుపరి చర్యలు ఉంటాయని వివరణ
తిరుపతి మాస్టర్ ప్లాన్ లో భాగంగా 14 రోడ్లు నిర్మించేందుకు రూ.2,500 కోట్ల మేర మున్సిపల్ అధికారులు టీడీఆర్ బాండ్లు జారీ చేయగా, అందులో వైసీపీ నేతలు భారీగా అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలు రావడం తెలిసిందే. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ టీడీపీ బాండ్ల జారీపై ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాన్ని కూటమి ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. దీనిపై ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పందించారు. 

తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీడీఆర్ బాండ్ల అక్రమాలపై విచారణకు కమిటీ వేశామని వెల్లడించారు. సెప్టెంబరు చివరినాటికి టీడీఆర్ బాండ్ల అక్రమాల నిగ్గు తేలుస్తామని స్పష్టం చేశారు. కమిటీ నివేదిక వచ్చాక తదుపరి చర్యలు ఉంటాయని అన్నారు. 

టీడీఆర్ బాండ్లలో వేల కోట్ల రూపాయలు పక్కదారి పట్టాయని, వైసీపీ పాలనలో అవినీతిని కొత్త పుంతలు తొక్కించారని మంత్రి నారాయణ విమర్శించారు. 

ఇక, పురపాలక శాఖలోని సమస్యలను 6 నెలల్లో పరిష్కరిస్తామని చెప్పారు. సెప్టెంబరు 13న రాష్ట్రంలో మరో 75 అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తామని వెల్లడించారు.

TDR Bonds
Irregularities
P Narayana
Tirupati
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh

More Telugu News