వైద్యుల నిర్లక్ష్యం.. ఆపరేషన్ సమయంలో మహిళ కడుపులో టవల్ వదిలేసిన వైనం!

  • ఉత్తరప్రదేశ్ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం
  • ఆపరేషన్ కు వచ్చిన గర్భవతి కడుపులో టవల్ ఉంచి కుట్లు వేసిన వైద్యులు
  • వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన బాధితురాలి భర్త  
ప్రజల ప్రాణాలు కాపాడే వైద్యులను భగవంతుడిగా భావిస్తుంటారు. కానీ కొందరు వైద్యుల నిర్లక్ష్యం వల్ల రోగుల ప్రాణాలు గాలిలో కలిసిపోతుంటాయి. ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో నిర్లక్ష్యం వల్ల వారి శరీరంలో బ్యాండేజ్ క్లాత్, కత్తెర, కాటన్ వంటివి పెట్టి కుట్లు వేసిన ఘటనలు ఇంతకు ముందు అనేకం వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ లోని ఓ ఆసుపత్రిలోనూ ఇటువంటి షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆలీగఢ్ లోని జీటీ రోడ్డులో గల శివ్ మహిహా ఆసుపత్రికి ఇటీవల వికాస్ కుమార్ అనే వ్యక్తి తన భార్యను డెలివరీ కోసం తీసుకువెళ్లారు. ఆమెకు కవలలు జన్మించారు. అయితే.. ఆపరేషన్ సమయంలో వైద్యుల తీవ్ర నిర్లక్ష్యం తర్వాత బయటపడింది. ఆపరేషన్ తర్వాత ఆమె కడుపులో నొప్పిగా ఉందని చెప్పినా వైద్యులు పట్టించుకోకుండా మందులు ఇచ్చి పంపించి వేశారు. ఆ తర్వాత ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో భర్త ఆమెను వేరే ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. అక్కడ వైద్యులు ఆమెను పరీక్షించగా ఆపరేషన్ చేసిన వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది.
 
ఆమె కడుపులో టవల్ ఉండటాన్ని గమనించి వైద్యులు షాక్ కు గురయ్యారు. వెంటనే ఆమెకు శస్త్ర చికిత్స చేసి కడుపులోని టవల్ ను తొలగించి ఆమెను కాపాడారు. ఆపరేషన్ సమయంలో వైద్యుల నిర్లక్ష్యానికి సీరియస్ అయిన ఆమె భర్త  తాజా శస్త్ర చికిత్సకు సంబంధించిన వీడియోను జత చేస్తూ వైద్య ఆరోగ్య శాఖకు ఫిర్యాదు చేశారు. ఆపరేషన్ సమయంలో నిర్లక్ష్యం ప్రదర్శించిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం, పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో చీఫ్ మెడికల్ ఆఫీసర్ దర్యాప్తునకు ఆదేశించారు. ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

pregnant woman
operation
Doctors
uttarapradesh

More Telugu News