నేడు మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌కు సీఎం చంద్రబాబు .. ప్రజలు, పార్టీ శ్రేణుల నుంచి వినతుల స్వీకరణ

  • నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉండనున్న సీఎం చంద్రబాబు
  • గ్రీవెన్స్ కార్యక్రమానికి అనూహ్య స్పందన
  • సమస్యల పరిష్కారం కోసం విన్నవించుకోనున్న బాధితులు
  • నామినేటెడ్ పదవుల కోసం నాయకుల వినతులు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. పార్టీ శ్రేణులు, ప్రజలకు.. నేతలు, ప్రజా ప్రతినిధులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజలు, పార్టీ శ్రేణుల నుంచి వినతులు స్వీకరించాలని ఆదేశించడంతో నిత్యం వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో బాధితులు తమ సమస్యల పరిష్కారానికి పార్టీ కార్యాలయానికి వచ్చి అర్జీలు అందజేస్తున్నారు. 

ఈ కార్యక్రమానికి ప్రజలు, పార్టీ శ్రేణుల నుంచి అనూహ్య స్పందన కనబడుతోంది. అయితే వారంలో ఒక రోజు పార్టీ కార్యాలయంలో తనే స్వయంగా అందుబాటులో ఉండి ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు.
  
ఈ క్రమంలో భాగంగా నేడు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఉదయం 11 గంటల నుంచి పార్టీ శ్రేణులకు చంద్రబాబు అందుబాటులో ఉంటారు. ప్రజల నుంచి నేరుగా సమస్యలు తెలుసుకుని వినతి పత్రాలు స్వీకరిస్తారు. ఈ గ్రీవెన్స్ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి బాధితులు, ప్రజలు వచ్చి తమ సమస్యలు విన్నవిస్తుండగా, పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన నాయకులు పలువురు నామినేటెడ్ పదవుల కోసం అభ్యర్థనలు అందజేస్తున్నారు.

Chandrababu
Chief Minister
Andhra Pradesh
NTR BHAVAN

More Telugu News