లోక్ సభ స్పీకర్ పదవికి 1976 తరువాత తొలిసారి ఎన్నికలు... బరిలో కాంగ్రెస్ ఎంపీ సురేశ్

  • స్పీకర్ పదవిపై అధికార, ప్రతిపక్షాల మధ్య కుదరని ఏకాభిప్రాయం
  • నేటితో ముగియనున్న స్పీకర్ పదవి నామినేషన్ గడువు
  • ఇప్పటికే ఎన్డీయే తరఫున ఓం బిర్లా నామినేషన్
లోక్ సభ స్పీకర్ పదవికి ఇండియా కూటమి తరఫున కాంగ్రెస్ ఎంపీ కె సురేశ్ నామినేషన్ వేశారు. సురేశ్ కేరళలోని మావెళికార నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. ఆయన కేరళ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఆయన ఎనిమిదిసార్లు ఎంపీగా గెలిచారు. స్పీకర్ ఎన్నిక విషయంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో లోక్ సభ స్పీకర్ పదవి కోసం 1976 తరువాత తొలిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ పదవికి నేటితో నామినేషన్ గడువు ముగియనుంది.

ఇప్పటికే ఎన్డీయే తరఫున ఓం బిర్లా నామినేషన్ దాఖలు చేశారు. ఓం బిర్లా రాజస్థాన్‌లోని కోటా నుంచి మూడోసారి ఎంపీగా గెలిచారు. 2019లో తొలిసారి ఆయన స్పీకర్‌గా ఎన్నికయ్యారు.

మోదీపై రాహుల్ గాంధీ ఆగ్రహం

ప్రధాని మోదీ చెప్పేదొకటి... చేసేది మరొకటి అని రాహుల్ గాంధీ మండిపడ్డారు. స్పీకర్ ఎన్నికల్లో అధికార పక్షానికి సహకరించేందుకు తాము సిద్ధమేనని చెప్పామన్నారు. అయితే సంప్రదాయం ప్రకారం డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు ఇవ్వాలన్నారు. కానీ రాజ్‌నాథ్ సింగ్‌తో మాట్లాడినప్పటికీ ఖర్గేకు హామీ రాలేదన్నారు. యూపీఏ సమయంలో ప్రతిపక్షాలకు డిప్యూటీ స్పీకర్ పదవిని ఇచ్చామన్నారు. మోదీ ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని హితవు పలికారు.

K Suresh
Speaker
Lok Sabha
NDA
UPA

More Telugu News