వైసీపీకి ఎదురుదెబ్బలు మొదలు.. టీడీపీ గూటికి చలమలశెట్టి?

  • నిన్న రాజీనామా చేసిన ఆదాల ముఖ్య అనుచరుడు వైవీ రామిరెడ్డి
  • టీడీపీలో చేరికకు చలమలశెట్టి సునీల్ ప్రయత్నాలు 
  • పలు పార్టీలు మారినా, పోటీ చేసిన నాలుగుసార్లూ ఓటమి
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దారుణ పరాభవం ఎదుర్కొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరికొన్ని ఎదురుదెబ్బలు తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ పార్టీ నేతలు ఇతర పార్టీలవైపు చూస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. నెల్లూరు జిల్లాకు చెందిన కీలక నేత, మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి ముఖ్య అనుచరుడు, పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ వైవీ రామిరెడ్డి ఆ పార్టీకి నిన్న రాజీనామా చేస్తూ. వెళ్తూవెళ్తూ ఆదాలపై తీవ్ర ఆరోపణలు చేశారు.

తాజాగా, ఆ పార్టీ నేత చలమలశెట్టి సునీల్ టీడీపీతో టచ్‌లోకి వెళ్లినట్టు తెలిసింది. ఇటీవలి ఎన్నికల్లో కాకినాడ నుంచి ఎంపీ స్థానానికి పోటీ చేసిన ఆయన కూటమి అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ చేతిలో పరాజయం పాలయ్యారు. తాజాగా, ఆయన పార్టీని వీడి టీడీపీలోకి వెళ్లేందుకు రెడీ అయినట్టు తెలిసింది. టీడీపీలో తనకున్న పరిచయాల ద్వారా పార్టీ అధినేత చంద్రబాబుకు రాయబారం పంపినట్టు సమాచారం. కాగా, సునీల్ ఇప్పటికే పలు పార్టీలు మారినా ఎక్కడా ఆయనకు కలిసిరాలేదు. 2009లో ప్రజారాజ్యం అభ్యర్థిగా, 2014లో వైసీపీ తరపున, 2019లో టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలు కాగా, తాజాగా వైసీపీ తరపున బరిలోకి దిగి కూటమి అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.

Chalamalasetty Sunil
YSRCP
Telugudesam
Andhra Pradesh

More Telugu News