క్వాలిఫయర్ 2 మ్యాచ్ కు వాన గండం? ఒకవేళ రద్దయితే ఫైనల్ చేరేది ఎవరంటే..!

  • చెన్నైలో శుక్రవారం జరగనున్న మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం
  • నగరంలో 48 గంటలపాటు తేలికపాటి వర్షం కురవొచ్చన్న వాతావరణ శాఖ
  • ఈ మ్యాచ్ కు రిజర్వ్ డే.. శుక్రవారం వీలుకాకుంటే శనివారం నిర్వహణ
  • ఒకవేళ రిజర్వ్ డే మ్యాచ్ సైతం రద్దయితే పాయింట్ల పట్టికలో పైనున్న జట్టుకు ఫైనల్ అర్హత
ఐపీఎల్ 2024 టోర్నమెంట్ లో మెగా ఫైనల్ కు ముందు ఇక ఒకే ఒక్క మ్యాచ్ మిగిలి ఉంది. క్వాలిఫయర్ 2లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో రాజస్థాన్ రాయల్స్ శుక్రవారం చెన్నైలోని చెపాక్ స్టేడియంలో తలపడనుంది. 

అయితే మ్యాచ్ రోజున వర్షం కురిసే అవకాశం ఉండటం ఇరు జట్ల అభిమానులను కలవరానికి గురిచేస్తోంది. వచ్చే 48 గంటలపాటు చెన్నైలో తేలికపాటి వర్షం కురవొచ్చని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. 

కానీ కొన్ని గంటలపాటు వర్షం ఏకధాటిగా కురిస్తేనే మ్యాచ్ ఆగిపోయే పరిస్థితి ఉంటుంది. ఒకవేళ అలా జరిగినా ఈ మ్యాచ్ కు రిజర్వ్ డే ఉంది. 

అంటే శుక్రవారం ఒకవేళ భారీ వర్షం కురిసి మ్యాచ్ రద్దయితే శనివారం తిరిగి నిర్వహించనున్నారు. ఒకవేళ అనూహ్యంగా శనివారం కూడా భారీ వర్షం కురిసి మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాకపోతే పాయింట్ల పట్టికలో ముందున్న జట్టు ఫైనల్ కు అర్హత సాధించనుంది. 

ఈ లెక్కన సన్ రైజర్స్ సులువుగా ఫైనల్ చేరుతుంది. లీగ్ స్టేజ్ లో ఇరు జట్లకు 17 పాయింట్ల చొప్పున లభించినప్పటికీ రాజస్థాన్ తో పోలిస్తే మెరుగైన రన్ రేట్ వల్ల సన్ రైజర్స్ రెండో స్థానంలో నిలవడమే ఇందుకు కారణం.

మరోవైపు రాజస్థాన్ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ సహా కొందరు ఆటగాళ్లు స్వల్ప అనారోగ్యంతో బాధపడుతుండటం ఆ జట్టు యాజమాన్యాన్ని కలవరపెడుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ గెలిచిన అనంతరం శాంసన్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. తాను 100 శాతం ఫిట్ గా లేనని.. దగ్గుతో బాధపడుతున్నానని పేర్కొన్నాడు. మరికొందరు ఆటగాళ్లు సైతం అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారని తెలిపాడు. అయితే క్వాలిఫయర్ 2కు ముందు తమకు ఒక రోజు విశ్రాంతి లభిస్తున్నందున తామంతా కోలుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశాడు.

IPL 2024
Sun Risers Hyderabad
Rajasthan Royals
Qualifier 2
Match
Chennai
Rain Alert
Weatherman

More Telugu News