భారత పౌరసత్వం పొందాక తొలిసారి ఓటేసిన సినీ నటుడు అక్షయ్ కుమార్!

  • ఐదవ దశ పోలింగ్ లో ఓటేసిన సినీ నటుడు
  • భారత్ శక్తిమంతంగా అవ్వాలనే దృష్టితో ఓటేశానని వెల్లడి
  • భారత ప్రజలు తమకు నచ్చిన వారికి ఓటేయాలని పిలుపు
ఐదవ దశ పోలింగ్‌ సందర్భంగా పలువురు బాలీవుడ్ నటులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తాజాగా అక్షయ్ కుమార్ కూడా ఓటు వేశారు. గతేదాది భారత పౌరసత్వం పొందాక ఆయన ఓటు వేయడం ఇదే తొలిసారి. పోలింగ్ బూత్ బయట ఆయన మీడియాతో మాట్లాడారు. 

‘‘భారత్ మరింత అభివృద్ధి చెందిన దేశంగా, శక్తిమంతంగా మారాలని కోరుకుంటున్నా. ఈ దృష్టిలోనే నేను ఓటు వేశాను. భారతీయులు కూడా తమకు నచ్చిన వారికి ఓటు వేయాలి. ఈసారి పోలింగ్ శాతం పెరుగుతుందనే అనుకుంటున్నా’’ అన్నారాయన. 

1990ల్లో బాలీవుడ్‌లో వరుసగా 15 పరాజయాలను ఎదుర్కొన్న అక్షయ్ కుమార్ కెనడా పౌరసత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఆ తరువాత ఆయనకు టైమ్ కలిసి రావడంతో మళ్లీ విజృంభించారు. 2019లో ఆయన మళ్లీ భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. గతేడాదే ఆయనకు పౌరసత్వం మళ్లీ లభించింది. 

అంతకుమునుపు అక్షయ్ కుమార్ కెనడా పౌరసత్వం వదులుకోవడంపై స్పందించారు. ‘‘నా సర్వస్వం భారత దేశమే. నేను సంపాదించింది, నేను పొందిందీ అంతా భారత్‌లోనే. దేశానికి నాకు చేతనైనంత తిరిగిచ్చే అవకాశం దక్కడం నా అదృష్టం. కానీ పూర్తిగా తెలుసుకోకుండా జనాలు  నోరు పారేసుకుంటుంటే బాధ కలుగుతుంది’’ అని అన్నారు.

Akshay Kumar
Lok Sabha Polls
Bollywood

More Telugu News