జగన్ చివరి నిమిషంలో సొంత కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్నారు... అడ్డుకోండి!: గవర్నర్ కు చంద్రబాబు లేఖ

TDP Chief Chandrababu wrote AP Governor
  • నిబంధనలకు విరుద్ధంగా బిల్లులు చెల్లిస్తున్నారన్న చంద్రబాబు
  • దీనిని తక్షణమే నిలుపుదల చేయాలని గవర్నర్ కు విజ్ఞప్తి
  • బటన్లు నొక్కిన పథకాలను ఇప్పటిదాకా ఎందుకు విడుదల చేయలేదంటూ ఆగ్రహం
జగన్ ప్రభుత్వం చివరి నిమిషంలో తన సొంత కాంట్రాక్టర్లకు నిబంధనలకు విరుద్దంగా బిల్లులు విడుదల చేసేందుకు సిద్దమైందని... దీనిని తక్షణమే నిలుపుదల చేయాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు నేడు లేఖ రాశారు. 

రాష్ట్ర ప్రభుత్వం సొంత కాంట్రాక్టర్లకు నిధులు విడుదల చేసేందుకు సిద్ధమైందని ఆరోపించారు. నిబంధనలకు విరుద్దంగా ఈ బిల్లుల విడుదల జరగబోతోందని తెలిపారు.  కొన్ని రోజుల క్రితం ఎన్నికల కోడ్ ప్రకటనకు ముందు బినామీ కాంట్రాక్టర్లకు, పెద్ద ఎత్తున కాంట్రాక్టర్లకు నిధులు విడుదల చేశారని చంద్రబాబు వెల్లడించారు. 

ఎన్నికల కోడ్ కు నెలల ముందు డీబీటీ పథకాలకు ముఖ్యమంత్రి అధికారికంగా బటన్ నొక్కినా గడువులోపు లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదని స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ కు ముందే బటన్ నొక్కిన పథకాలకు సంబంధించిన నిధులు ఎందుకు జమకాలేదో చెప్పాలని కేంద్ర ఎన్నికల సంఘం కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిందని చంద్రబాబు గుర్తు చేశారు. 

"అప్పులపైనే ఆధారపడి రోజువారీ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోందన్న విషయం మీకు తెలిసిందే. ప్రభుత్వ నిర్వహణ కోసం భారత రిజర్వ్ బ్యాంకు, బ్యాంకుల నుండి తరచూ ఓవర్ డ్రాఫ్ట్ కు వెళ్లింది.  

పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు, పీఎఫ్, మెడికల్ రీయింబర్స్ మెంట్ వంటి వాటిని కూడా చెల్లించకుండా ప్రభుత్వం బకాయిలు పెట్టింది. ఆరోగ్యశ్రీకి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోవడంతో సేవలు నిలిపేస్తామని ఆసుపత్రి యాజమాన్యాలు చెబుతున్నాయి.

ఫైనాన్స్ కమిషన్ ద్వారా పంచాయతీ రాజ్ కు చెందాల్సిన నిధులను సైతం ప్రభుత్వం దారి మళ్లించింది. రుణాల కింద తెచ్చిన రూ.4 వేల కోట్లు, బాండ్ల ద్వారా రూ.7000 కోట్లు ప్రభుత్వం సమీకరించింది. ఈ నిధులన్నీ ప్రభుత్వం ఉద్యోగులకు, పంచాయతీలకు, ఆరోగ్యశ్రీ కింద ఆసుపత్రులకు చెల్లించకుండా తమకు అనుకూల కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకు ప్రయత్నం చేస్తోంది. 

రాజకీయ స్వార్థం కోసం చేసే ఇటువంటి పనులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉంది. ప్రభుత్వ కుటిల యత్నాలను వెంటనే అరికట్టేందుకు, సీఎం జగన్ తన బినామీ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా మీరు ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలి. లబ్ధిదారులకు మేలు చేసే డీబీటీ పథకాలకు నిధులు చెల్లించేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించాలి" అంటూ చంద్రబాబు తన లేఖలో గవర్నర్ ను కోరారు. 

చంద్రబాబు.... గవర్నర్ కు రాసిన లేఖను కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ఆర్థిక ముఖ్య కార్యదర్శికి కూడా ట్యాగ్ చేశారు.
Go Back to Shorts
Chandrababu
Governor
Jagan
TDP
YSRCP

More Telugu News