గోమాంసం వినియోగాన్ని అనుమతించడమే కాంగ్రెస్ లక్ష్యం.. సీఎం యోగి తీవ్ర వ్యాఖ్యలు

  • ఇండియా కూటమి గోమాంసాన్ని ప్రోత్సహిస్తోందని ఆరోపణ
  • గోమాంసం విషయంలో ముస్లింలకు మినహాయింపునివ్వాలనే కాంగ్రెస్ ప్రయత్నం ఆమోదయోగ్యం కాదని వ్యాఖ్య
  • ఎన్నికల ప్రచారంలో ఉత్తరప్రదేశ్ సీఎం, బీజేపీ నేత ఆసక్తికర వ్యాఖ్యలు
లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో లక్ష్యంగా ఉత్తరప్రదేశ్ సీఎం, బీజేపీ అగ్రనేతల్లో ఒకరైన యోగి ఆదిత్యనాథ్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గోమాంసం వినియోగాన్ని అనుమతించడమే లక్ష్యంగా పెట్టుకుందని సీఎం ఆరోపించారు. విపక్షాల ఇండియా  కూటమి గోమాంసాన్ని ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. ఆవును పవిత్రంగా భావిస్తున్న దేశంలోని హిందూ సమాజం గోమాంస వినియోగానికి పూర్తిగా దూరం జరిగిందని యోగి అన్నారు. ఈ విషయంలో ముస్లింలకు మినహాయింపులు ఇవ్వాలనే కాంగ్రెస్ ప్రయత్నం అందరికీ ఆమోదయోగ్యం కాదని విమర్శించారు. 

ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం యోగి ఆదిత్యనాథ్ మీడియాతో మాట్లాడారు. అంతకుముందు శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో కూడా గోమాంసం వినియోగంపై ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ మైనారిటీలకు గొడ్డు మాంసం తినే హక్కును కల్పించాలని కోరుకుంటోందని అన్నారు. జంతు వధకు సంబంధించి ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటికే కఠినమైన చట్టాలు ఉన్నాయని, 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష, రూ.5 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని ఆయన ప్రస్తావించారు. కాగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 2020లో గోవధను నిషేధిస్తూ ఆర్డినెన్స్‌ను రూపొందించింది. అనంతరం దానిని చట్టంగా మార్చిన విషయం తెలిసిందే.



Yogi Adityanath
Congress
BJP
INDIA Bloc
Lok Sabha Polls

More Telugu News