ప్రధాని మోదీ ప్రజాగళం సభలో భద్రతా వైఫల్యంపై నివేదిక కోరిన ఈసీ

  • ఈ నెల 17న చిలకలూరిపేట వద్ద ప్రజాగళం సభ
  • హాజరైన ప్రధాని మోదీ
  • పలు భద్రతా వైఫల్యాలు చోటుచేసుకున్నాయంటూ విపక్షాల ఆగ్రహం
  • ఏపీ సీఈవోకు ఫిర్యాదు చేసిన కూటమి నేతలు
  • తాజాగా ఈ అంశంపై దృష్టి సారించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఇటీవల పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడి వద్ద టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రజాగళం సభ నిర్వహించింది. ఈ సభకు ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరు కాగా, భద్రతా వైఫల్యాలు చోటుచేసుకున్నాయంటూ విపక్షాలు ఏపీ అధికారపక్షం వైసీపీపై దుమ్మెత్తిపోశాయి. ప్రధాని పాల్గొన్న సభలో పోలీసుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించిందని మండిపడ్డాయి. 

ఈ సభలో మైక్ సరిగా పనిచేయకపోవడం, మైక్ సెట్టింగ్ కంట్రోల్ వద్ద తోపులాట, లైటింగ్ టవర్లపైకి జనం ఎక్కడం, వారిని నియంత్రించాల్సిన పోలీసులు దరిదాపుల్లో లేకపోవడం వంటి అంశాలపై కూటమి నేతలు రెండ్రోజుల కిందట ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ముఖేశ్ కుమార్ మీనాను కలిసి ఫిర్యాదు చేశారు. 

తాజాగా ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం కూడా దృష్టి సారించింది. ప్రధాని మోదీ హాజరైన ప్రజాగళం సభలో చోటుచేసుకున్న భద్రతా వైఫల్యాలపై నివేదిక ఇవ్వాలంటూ ఏపీ సీఈవోను కోరింది. త్వరగా విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని సీఈవోను ఈసీ ఆదేశించింది.

Praja Galam
Narendra Modi
EC
CEO
Chilakaluripet
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh

More Telugu News