టీడీపీని నాశనం చేసేది చంద్రబాబు పనులే..: విజయసాయి రెడ్డి

  • ముఖ్యమంత్రి పదవి కోసం దిగజారుతున్నారని విమర్శ
  • పార్టీ ఐడియాలజీని కాలరాసి కార్యకర్తలను మోసం చేస్తున్నారని ఫైర్
  • నాలుగేళ్ల క్రితం మాట్లాడిన మాటలను గాలికి వదిలేశారని ఆరోపణ
తెలుగుదేశం పార్టీని నాశనం చేసేది వైసీపీ కాదని, ముందు చంద్రబాబు చేతలే ఆ పార్టీని దెబ్బతీస్తాయని ఎంపీ విజయసాయి రెడ్డి చెప్పారు. చంద్రబాబు స్వయంగా తన చేతలతో తనే పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు. చివరిసారి ముఖ్యమంత్రి పదవిలో కూర్చోవాలనే ఆరాటంతో నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పదవి కోసం పార్టీ ఐడియాలజీని పక్కనపెట్టి, పార్టీ క్యాడర్ ను, తనను నమ్ముకున్న నేతలను మోసం చేస్తున్నారని మాజీ సీఎంపై విమర్శలు గుప్పించారు. ఈమేరకు ఆదివారం విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. నాలుగేళ్ల క్రితం చెప్పిన మాటలను, కార్యకర్తలకు కలిగించిన భరోసాను చంద్రబాబు వమ్ము చేశారని మండిపడ్డారు. అధికారం కోసం, ముఖ్యమంత్రి పదవి కోసం ఇంత నిస్సిగ్గుగా వ్యవహరించాలా.. అంటూ ట్విట్టర్ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశ్నించారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టడంపైనా విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పించారు. ఎన్నికలు పూర్తయి వైసీపీ గెలిచాక రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉనికిలో లేకుండా పోతుందని జోస్యం చెప్పారు. కూటమి ఉండేది నాలుగు రోజులే అయినా సరే దీనికి కొన్ని పేర్లు సూచిస్తానని అంటూ మరో ట్వీట్ చేశారు. ఇందులో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ‘ట్రిపుల్ యూ టర్న్, ది డిస్కార్డ్ కన్సార్టియం, ట్రిపుల్ డైలమా అలయెన్స్, టగ్ ఆఫ్ వార్ ట్రయంవేర్, త్రీ స్టెప్స్ బ్యాక్ వర్డ్’ అంటూ విజయసాయి రెడ్డి పేర్లు సూచించారు.

Vijayasai Reddy
YSRCP
TDP
Decimate
Chandrababu
Own Actions

More Telugu News