మహాలక్ష్మి పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారో చెప్పండి: పల్లా రాజేశ్వర్ రెడ్డి

  • గవర్నర్ ప్రసంగంలో అరచేతిలో వైకుంఠం చూపించారన్న రాజేశ్వర్ రెడ్డి
  • ఆరోగ్యశ్రీ ద్వారా రూ. 10 లక్షలు ఇస్తున్నారా? అని ప్రశ్న
  • 13 హామీలు ఇచ్చి.. 2 హామీలు అమలు చేశామని చెప్పుకుంటున్నారని ఎద్దేవా
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. గవర్నర్ ప్రసంగంపై చర్చ సందర్భంగా... రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎదురుదాడి చేస్తున్నారు. గవర్నర్ ప్రసంగంలో అరచేతిలో వైకుంఠాన్ని చూపించారని బీఆర్ఎస్ సభ్యుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. గవర్నర్ తమిళిసైతో 30 మోసాలు, 60 అబద్ధాలు చెప్పించారని విమర్శించారు. ప్రజాభవన్ కు వచ్చే ప్రజల ఫిర్యాదులను తీసుకోవడానికి అక్కడ ఎవరూ ఉండటం లేదని చెప్పారు. ఈ రెండు నెలల కాలంలో ఏ ఒక్క వ్యక్తి సమస్యనైనా పరిష్కరించారా? అని ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ ద్వారా రూ. 10 లక్షలు ఇస్తామని చెప్పారని... ఆ మొత్తం ఇస్తున్నారా? అని అడిగారు. 

కాంగ్రెస్ పార్టీ 13 హామీలను ఇచ్చిందని... ఇప్పటి వరకు రెండు హామీలను అమలు చేశామని చెప్పుకుంటున్నారని రాజేశ్వర్ రెడ్డి విమర్శించారు. సరిపడా ఆర్టీసీ బస్సులు లేక మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. మహాలక్ష్మి పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో మంత్రి శ్రీధర్ బాబు కల్పించుకుంటూ... ప్రభుత్వం కుదురుకోవడానికి కొంత సమయం కూడా ఇవ్వరా? అని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి కోసం బీఆర్ఎస్ సభ్యులు మంచి సలహాలను ఇస్తే స్వీకరిస్తామని చెప్పారు.

Palla Rajeswar Reddy
BRS
Sridhar Babu
Congress
TS Assembly

More Telugu News