విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం జగన్

  • విజయవాడ స్వరాజ్య మైదానంలో భారీ అంబేద్కర్ విగ్రహం
  • రూ.400 కోట్లతో అంబేద్కర్ స్మృతి వనం 
  • ఈ విగ్రహం చరిత్రలో నిలిచిపోతుందన్న విజయసాయిరెడ్డి
  • అంబేద్కర్ ఆశయాలను సీఎం జగన్ ముందుకు తీసుకెళుతున్నారని ప్రశంస 
ఏపీ ప్రభుత్వం విజయవాడలోని స్వరాజ్య మైదానంలో 125 అడుగుల ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విగ్రహ నిర్మాణం పూర్తి కాగా, అంబేద్కర్ స్మృతి వనం కూడా రూపుదిద్దుకుంది. ఇవాళ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విజయవాడలో అంబేద్కర్ స్మృతివనాన్ని పరిశీలించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 19న సీఎం జగన్ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారని వెల్లడించారు. ఈ విగ్రహం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. ఈ సందర్భంగా సమతా సభ ఏర్పాటు చేశామని, 1.20 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నామని తెలిపారు. లేజర్ షో గానీ, డ్రోన్ షో గానీ ఏర్పాటు చేయనున్నామని వివరించారు. ఈ నెల 20 నుంచి విజయవాడలో అంబేద్కర్ విగ్రహ సందర్శనకు అనుమతి ఉంటుందని అన్నారు. 

విజయవాడలో అంబేద్కర్ స్మృతివనాన్ని రూ.400 కోట్లతో నిర్మించారని తెలిపారు. ఈ భారీ అంబేద్కర్ విగ్రహం సమసమాజానికి నిలువెత్తు నిదర్శనంలా నిలుస్తుందని విజయసాయి పేర్కొన్నారు. 

అంబేద్కర్ మహనీయుడి ఆశయాలను సీఎం జగన్ ముందుకు తీసుకెళుతున్నారని విజయసాయి కొనియాడారు. నవరత్నాల పథకాల వెనుక అంబేద్కర్ స్ఫూర్తి ఉందని అన్నారు.

Ambedkar Satatue
Vijayawada
CM Jagan
Vijayasai Reddy
YSRCP
Andhra Pradesh

More Telugu News